‘‘పన్నీర్సెల్వం ఓ బచ్చా.. ఓ అనాథ, పదవి ఊడేసరికి ఇలా.., అన్నీ నిబంధనల ప్రకారమే’’
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వంపై తాజాగా అన్నాడీఎంకే ప్రచార కర్త నాంజిల్ సంపత్ నిప్పులు చెరిగారు. ఆయన ఓ బచ్చా అని, అనాథ అంటూ ధ్వజమెత్తారు.
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వంపై తాజాగా అన్నాడీఎంకే ప్రచార కర్త నాంజిల్ సంపత్ నిప్పులు చెరిగారు. ఆయన ఓ బచ్చా అని, అనాథ అంటూ ధ్వజమెత్తారు. మంగళవారం సంపత్ విలేఖరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం అనంతరం పార్టీ నిబంధనల మేరకే అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరిగిందని, అందులో వీకే శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, ఆ సమావేశంలో ముఖ్యమంత్రి హోదాలో ఓపీఎస్ కూడా పాల్గొన్నారని నాంజిల్ సంపత్ గుర్తు చేశారు.
ఆస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడంతో పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకునే విధంగా టీటీవీ దినకరన్ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమించారన్నారు. ఇందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన లేదన్నారు.

జయ మరణం తరువాత కూడా ఓపీఎస్ ముఖ్య మంత్రిగా కొనసాగారని, అయితే ఒక్కసారి కూడా ఆమె మరణం గురించి అనుమానం వ్యక్తం చేయలేదని, అలాంటిది సీఎం పదవి పోయిందన్న అక్కసుతో ఈ అంశాన్ని ఇప్పుడు ప్రజల ముందుంచి తమది ధర్మ యుద్ధమని చెప్పుకోవడం సిగ్గు చేటు అని సంపత్ విమర్శించారు.
ఎడప్పాడి పళనిస్వామిని కూడా శశికళ సీఎంను చేశారని, ఆయన పార్టీ గురించి ప్రభుత్వం గురించి ఒక్కసారి కూడా విమర్శించలేదని, అయితే ఆయన వెంట ఉన్న జయకుమార్ వంటి నేతలు, ఓపీఎస్ వంటి ద్రోహులు దినకరన్ ను పార్టీలో చేర్చుకోవద్దని చెబుతున్నారని, అలా చెప్పే అర్హత వారికి లేదన్నారు.
దినకరన్ను విమర్శించే ఎమ్మెల్యేలు ఎవరైనా వారి వారి నియోజకవర్గాలకు వెళ్లలేరని నాంజిల్ సంపత్ హెచ్చ రించారు. జయలలిత అండదండలతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ దినకరన్ దశల వారీగా కలుసుకుని, ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో చర్చిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications