ఏడాది జైలు: జ్యుడిషియల్ కస్టడీకి కేంద్ర మంత్రి నఖ్వీ
న్యూఢిల్లీ: కేంద్ర మైనారిటీ శాఖ సహాయ మంత్రి, బిజెపి నేత ముక్తార్ అబ్బాస్ నక్వీని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఆయనను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్లో అదుపులోకి తీసుకున్నారు. 2009 ఎన్నికల్లో నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు ఆయనకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన కేసులో ఆయనకు రాంపూర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. నఖ్వీతో పాటు మరో 19 మంది నిందితులు కేసులో దోషులుగా తేలిన తర్వాత కోర్టు కస్టడీలో ఉన్నారు. కోర్టు బయట ఆయన అనుచరులు నినాదాలు చేశారు.
రాంపూర్ జిల్లా పట్వాయి పోలీసు స్టేషన్లో 2009 లోకసభ ఎన్నికల సందర్భంగా నఖ్వీపై, ఆయన అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 2009 లోకసభ ఎన్నికల సందర్భంగా నఖ్వీ బిజెపి కార్యకర్తలతో కలిసి రాంపూర్ లోకసభ స్థానంలోని పట్వాయి ప్రాంతంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనపై కేసు నమోదైంది.
ఆ సందర్భంగా నఖ్వీ, మరింత మంది నిషేధాజ్ఞలను ఉల్లంఘించి, పోలీసు స్టేషన్లోకి దూసుకెళ్లారని అభియోగం మోపారు. చట్టవ్యతిరేకంగా గుమికూడారనే అభియోగం కింద వారిపై కేసు నడిచింది. తీర్పు వెలువరించిన తర్వాత నఖ్వీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.