పదవి చేజారిపోతుందనే భయంతో పూజలు చేసిన సీఎం
చెన్నై: పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి రహస్యంగా యాగం నిర్వహించడం సంచలనం కల్గించింది.తన పదవిని కాపాడుకొనేందుకే సిఎం ప్రత్యేకంగా యాగం చేశారని చెబుతున్నారు.
తొలుత ఆయన పుదుచ్చేరికి ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిగా ఆయనను ఎన్నుకొన్నారు. అయితే ఏదేనీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయన ఆరు మాసాల్లోపుగా ఎంఎల్ఏగా ఎన్నిక కావాలి. ముఖ్యమంత్రి పోటీచేసేందుకు వీలుగా నెల్లితోపు నియోజకవర్గం నుండి విజయం సాధించిన జానకుమార్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించారు.
త్వరలో నెల్లితోపు లో జరిగే ఉపఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ఆయన పోటీలో నిలిచారు.అయితే చివరి నిమిషంలో అన్నాడిఎంకె అభ్యర్థి ఓంశక్తిశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు.దీంతో ఈ ఎన్నికల్లో పోటీ ఆసక్తికరంగా మారింది.
పుదుచ్చేరి కి ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో నారాయణస్వామి విజయం సాధించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.దరిమిలా ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను నారాయణస్వామి శాయశక్తులను ఒడ్డుతున్నారు. పుదుచ్చేరిలోని ప్రసిద్ది చెందిన ఎల్లయమ్మన్ ఆలయంలో ఆయన అర్థరాత్రి ప్రత్యేక పూజలు, యాగం చేశారు.ఎన్నికల్లో విజయం చేకూరాలని ఆయన ఈ యాగం చేశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.