ఉప ఎన్నికల్లో గెలిచిన ముఖ్యమంత్రి, సీటు పదిలం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ముఖ్యమంత్రి పదవిని పదిలం చేసుకున్నారు.
చెన్నై: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. పుదుచ్చేరి నెల్లితోపే అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి ఓంశక్తి శేఖర్ పైన 11,151 ఓట్ల తేడాతో గెలుపొందారు.
గత మే 16వ తేదీన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ గెలవడంతో నారాయణ స్వామి సీఎం అయ్యారు. అయితే ఆయన ఎమ్మెల్యే కాకపోవడంతో ఇప్పుడు ఉప ఎన్నికల బరిలో దిగారు. నారాయణ స్వామి సీఎంగా కొనసాగాలంటే ఎన్నికల్లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హోరాహోరీ పోరులో ఆయన గెలిచారు.
మరోవైపు, త్రిపురలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు రాలేదు. బర్జాలా, ఖోవాయి.. రెండు అసెంబ్లీ స్థానాలను సీపీఎం కైవసం చేసుకుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.
కాగా, నవంబర్ 19వ తేదీన దేశవ్యాప్తంగా నాలుగు పార్లమెంటు స్థానాలకు, 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలను ఈ రోజు (నవంబర్ 22) వస్తున్నాయి. ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. అసోం, అరుణాచల్ ప్రదాశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, త్రిపుర తదితర చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి.