రాత్రి పూట స్కూటీపై సీఎం: వీధుల్లో చక్కర్లు కొడుతూ ఇలా!..
శివారు ప్రాంతాల్లో వీధి లైట్లు వెలగడం లేదన్న ఫిర్యాదులు రావడంతో కాలనీల్లో స్కూటీపై కలియతిరిగారు.
చెన్నై: పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి బుధవారం రాత్రి పూట స్కూటీపై నగరంలో చక్కర్లు కొట్టారు. శివారు ప్రాంతాల్లో వీధి లైట్లు వెలగడం లేదన్న ఫిర్యాదులు రావడంతో కాలనీల్లో స్కూటీపై కలియతిరిగారు.
బుధవారం రాత్రి 8.30గం.కు పుదుచ్చేరి ఎల్లయమ్మన్ కోవిల్ వీధిలోని తన ఇంటి నుంచి సీఎం స్కూటర్ పై బయలుదేరారు. మరో మంత్రి కమలకన్నన్ కూడా మరో స్కూటీపై ఆయనను అనుసరించారు. ఈ క్రమంలో మిషన్ వీధి, పుస్కి వీధి, ఆంబూర్ రోడ్డు, అరవింద్ వీధి, అన్నాసాలై, ఎస్పీ పటేల్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో వీధి లైట్లు పనిచేస్తున్నాయా? లేదా? అన్నది పరిశీలించారు.
దాదాపు రాత్రి 11గం. వరకు ఆయన కాలనీల్లోనే కలియతిరిగినట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ సమస్యలు వాటన్నింటిని వెంటనే పరిష్కరించాలని సీఎం విద్యుత్ అధికారులను ఆదేశించారు.
HCM @VNarayanasami made inspection to check the street lights , woman safety, across Pdy about25Kms with H.Min.Shri.Kamalakannan, Officials pic.twitter.com/5rj3MV9u2J
— V.Narayanasamy (@CMPuducherry) September 13, 2017
కాగా, సీఎం స్కూటీపై రావడంతో స్థానికులంతా ఆసక్తిగా చూశారు. వీధిలైట్లు, మహిళా భద్రత గురించి తెలుసుకునేందుకు 25కి.మీ స్కూటీలపై ప్రయాణించినట్లు సీఎం తెలిపారు. తాను స్కూటీపై ప్రయాణిస్తున్న ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే సీఎం సహా ఆయనతో స్కూటర్లపై వెళ్లినవారెవరూ హెల్మెట్ ధరించకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే, రాత్రి సమయంలో మహిళలకు ఏ విధమైన రక్షణ ఉందో పరిశీలించటానికి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కూడా గత నెల 18న స్కూటర్పై పుదుచ్చేరి రోడ్లపై ద్విచక్రవాహనంతో ప్రయాణించిన సంగతి తెలిసిందే.