బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో బిగ్ ఫిష్: ఆ స్టార్ హీరోకు సమన్లు: ప్రొడ్యూసర్ భార్య అరెస్టుతో
ముంబై: కొద్దిరోజులుగా బాలీవుడ్ను కుదిపేస్తోన్న డ్రగ్స్ కేసుల్లో మరో కొత్త ముఖం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రామ్పాల్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. డ్రగ్స్ కేసులో దర్యాప్తు చేస్తోన్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో అధికారులు ఆయనకు కొద్దిసేపటి కిందటే సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఎన్సీబీ అధికారులు ఈ ఉదయం ముంబైలోని ఆయన నివాసంపై దాడి చేశారు. కొన్ని గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా డ్రగ్స్కు సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ రాత్రి గడిస్తే చాలు: పారామిలటరీ బలగాల పహారాలో బిహార్: ఎగ్జిట్ పోల్స్ హీట్
సోదాలను ముగిసిన కొద్దిసేపటికే ఆయనకు సమన్లను జారీ చేశారు. ఇదే కేసులో బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నడియాడ్వాలా భార్యను ఎన్సీబీ అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆమెను విచారించిన సందర్భంగా అర్జున్ రామ్పాల్ పేరును వెల్లడించినట్లు తెలుస్తోంది. ఫిరోజ్ నడియాడ్వాలా భార్య అరెస్టయిన మరుసటి రోజే అర్జున్ రామ్పాల్ ఇంటిపై అధికారులు దాడి చేయడం, అనంతరం సమన్లను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఫిరోజ్ నడియాడ్వాలా నివాసంపై దాడి చేసిన సమయంలో ఎన్సీబీ అధికారులు 10 గ్రాముల మరిజువానాను స్వాధీనం చేసుకున్నట్లు తెలస్తోంది. దీనితో ఆమెను అరెస్టు చేశారు. దీన్ని ఏ డ్రగ్ పెడ్లర్ వద్ద నుంచి కొనుగోలు చేశారనే విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసులో విచారణ సందర్భంగా బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్సీబీ అధికారులు ఇప్పటికే టాప్ సెలెబ్రిటీలను విచారించారు. దీపికా పడుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్లను విచారించారు.