టీవీ ముందు మోడీ: వ్రతాలు ఫలించాయన్న తల్లి
గాంధీనగర్: దేశమంతా ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లోని తన నివాసంలో టీవీ చూస్తున్నారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా తెలిసే వరకూ మోడీ తన నివాసంలో టీవీ చూడటానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
శుక్రవారం ఎన్డీఏ కూటమి విజయం ఖరారైన తర్వాత రెండు భారీ ర్యాలీలు నిర్వహించడానికి నరేంద్ర మోడీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అంతకంటే ముందు మోడీ.. తన తల్లి వద్ద ఆశీస్సులు తీసుకుంటారని బిజెపి వర్గాలు తెలిపాయి. కాగా, వడోదర లోకసభ స్థానం నుంచి నరేంద్ర మోడీ ఘన విజయం సాధించారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోడీ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తను చేసిన వ్రతాలు, పూజలు ఫలించాయని తెలిపారు. తన కుమారుడు దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడని తెలిపారు. బిజెపి సీనియర్ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. మోడీ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకున్నారని, అందుకే బిజెపిని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తున్నారని చెప్పారు.
శుక్రవారం ఉదయం 11 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. గుజరాత్ రాష్ట్రంలోని అన్ని లోకసభ స్థానాల్లోనూ బిజెపి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 26 నియోజకవర్గాల్లోనూ బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. గాంధీనగర్ నుంచి లోకసభ బరిలో ఉన్న బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ ఘన విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.