మద్దతివ్వబోం: దాద్రి ఘటనపై మౌనం వీడిన మోడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపిన దాద్రి ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎట్టకేలకు నోరు విప్పారు. దాద్రి తరహా ఘటనలు విచారకరమని పేర్కొన్న ఆయన ఈ తరహా ఘటనలకు భారతీయ జనతా పార్టీ మద్దతివ్వబోదని తేల్చిచెప్పారు.
గోమాంసం తిన్నారన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్ లోని దాద్రి గ్రామంలో అఖ్లాఖ్ అనే ముస్లిం వ్యక్తిపై కొందరు హిందువులు దాడి చేశారు. ఈ ఘటనలో అఖ్లాఖ్ చనిపోగా, ఆయన కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
దీనిపై స్పందించేందుకు తొలుత కేంద్ర మంత్రులు వెనకడుగు వేసినా, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు స్పందించారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు మంత్రులు ఈ ఘటనను ఖండించారు. ఇలాంటి ఘటనలను తమ ప్రభుత్వం సహించబోదని చెప్పారు.
అయితే ప్రధాని మోడీ మాత్రం మంగళవారం దాకా దీనిపై నోరు విప్పలేదు. దీంతో విపక్షాలన్ని మోడీపై విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో బెంగాల్కు చెందిన ఓ పత్రికతో మాట్లాడిన సందర్భంగా మోడీ.. దాద్రి ఘటనను ఖండించారు.
‘దాద్రి లాంటి ఘటన నిజంగా విచారకరం. ఈ ఘటనల వెనుక కీలక అంశమేంటి? ఇలాంటి ఘటనలకు బిజెపి మద్ధతివ్వబోదు. ఈ తరహా ఘటనలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. వాటి బూటకపు లౌకికత్వానికి బిజెపి విరుద్ధం' అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ గాయకుడు గులాం అలీపై జరిగిన వివాదాన్ని కూడా మోడీ ఖండించారు. ఇలాంటి ఘటనలు విచారకరమని అన్నారు.