‘ఖాన్’ త్రయాన్ని ఒక వేదికపైకి తెస్తున్న మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్లు వేదిక పంచుకోనున్నారు. ముగ్గురు ఖాన్లు ఒకే వేదికపై కనిపించడమనేది చాలా అరుదు. ప్రధాని నరేంద్ర మోడీ కారణంగా ఈ ముగ్గురు ఒకే వేదికపై కనిపించనున్నారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ.. ఒకే వేదికపై ఈ ముగ్గురు ఖాన్లను చూసే అవకాశాన్ని అభిమానులకు కల్పించనున్నారు. అసలు విషయం ఏమిటంటే.. మోడీ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు కావస్తున్న సందర్భంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 'జరా ముస్కురా దో(చిరునవ్వు నవ్వండి)' అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్లు కూడా అతిథులుగా హాజరుకానున్నారు. ఈ మేరకు వీరికి కేంద్ర సమాచార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి.
కేవలం ఈ ముగ్గురినే గాక, ప్రముఖులు అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, రితేష్ దేశ్ముఖ్, ఏఆర్ రహమాన్, రాజ్ కుమార్ హిరానీ, సైనా నెహ్వాల్, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను కేంద్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఆహ్వానించింది.
కాగా, 'జర ముస్కురా దో' కార్యక్రమాన్ని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు సహా మొత్తం 60వేల మంది అతిథులు హాజరుకానున్నారు. కాగా, ఇటీవల అసహనంపై వ్యాఖ్యలు చేసి అమీర్ ఖాన్, షారుక్ ఖాన్లు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.