క్రిప్టో కరెన్సీ స్కాం: రాజ్కుంద్రాను ప్రశ్నించిన ఈడీ
ముంబై: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపార వేత్త రాజ్కుంద్రాను ముంబై బ్రాంచికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నించారు. ఇటీవల పుణెలో వెలుగు చూసిన వేల కోట్ల రూపాయల క్రిప్టో కరెన్సీ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు కుంద్రాను విచారించారు. కొన్ని అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన నేపథ్యంలో రాజ్ కుంద్రాను ప్రశ్నించేందుకు పిలిచామని అధికారులు వెల్లడించారు.
కుంద్రా మంగళవారం ఉదయం దక్షిణ ముంబైలోని ఈడీ జోన్ 2 కార్యాలయానికి వచ్చారు. ఆయనను ప్రశ్నిస్తున్నామని ఈడీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.క్రిప్టో కరెన్సీ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది.
చాలా మంది నటీమణులు ఈ క్రిప్టో కరెన్సీ పథకానికి ప్రమోషనల్ వీడియోల ద్వారా ప్రచారం చేశారని ఈడీ వెల్లడించడంతో ఈ కుంభకోణంలో బాలీవుడ్కు సంబంధం ఉన్నట్లు బయటపడింది. బిట్కాయిన్ తరహా క్రిప్టో కరెన్సీలు కొన్ని దేశాల్లో చట్టబద్ధమైనవే కానీ భారత్లో కాదు. ఇది డిజిటల్ రూపంలో ఉంటాయి. ఈ కరెన్సీకి భారత్లో ఎలాంటి చట్టబద్ధత లేదు.
జూన్ 2017 నుంచి జనవరి 2018 మధ్యలో గెయిన్బిట్కాయిన్ అనే సంస్థ వ్యవస్థాపకులు అమిత్ భరద్వాజ్, అతడి సోదరుడు వివేక్ భరద్వాజ్లు క్రిప్టో కరెన్సీ పథకం పేరుతో దాదాపు 8వేల మంది పెట్టుబడి దారులను రూ.2వేల కోట్ల రూపాయలతో మోసం చేశారు. వీరిద్దరినీ ఏప్రిల్ 5న పుణెలో అరెస్ట్ చేశారు. కాగా, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని అయిన రాజ్ కుంద్రా 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు కూడా ఆయనను ప్రశ్నించారు.