అవేం నమ్మకండి, అంతా బోగస్: మోడీ ప్రభుత్వంపై సుబ్రహ్మణ్య స్వామి సంచలనం
Recommended Video
న్యూఢిల్లీ: బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (సీఎస్ఓ) అధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
సీఎస్వోలోని సీనియర్ అధికారులపై నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. నోట్ల రద్దుతో ఎలాంటి నష్టం లేదని, అలాగే జీడీపీ విషయంలోను మంచి డాటా ఇవ్వాలని ఒత్తిడి ఉందని వ్యాఖ్యానించారు.
అదంతా బోగస్ నమ్మకండి
ఆయన అహ్మదాబాదులో చార్టర్డ్ అకౌంటెంట్ల సమావేశంలో మాట్లాడారు. త్రైమాసిక (జీడీపీ) డాటాను అనుసరించవద్దని, అదంతా బోగస్ అని వ్యాఖ్యానించారు. సీఎస్ఓను తన తండ్రి తీసుకు వచ్చారని, తాను ఇటీవలే కేంద్రమంత్రి సదానంద గౌడతో అక్కడకు వెళ్లానని స్వామి అన్నారు.
నేను సీఎస్వో డైరెక్టర్ని అడిగా
ఆ సమయంలో తాను సీఎస్ఓ డైరెక్టర్ను జీడీపీ గురించి అడిగానని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. నోట్ల రద్దు ప్రభావం ఉందని, కానీ లేదని చెప్పే ప్రయత్నాలు చేయడంతో తాను ఆ అధికారిని అడిగానని చెప్పారు.
నోట్ల రద్దు ప్రభావం ఎలా లెక్క కట్టారని అడిగా
నోట్ల రద్దు నవంబర్ 8న (2016) జరిగిందని, అలాంటప్పుడు ఈ త్రైమాసిక జీడీపీని ఎలా లెక్క కడతారని డైరెక్టర్ను అడిగానని చెప్పారు. ప్రింటెడ్ ఎకనామిక్ సర్వే నివేదికను ఫిబ్రవరి 1వ (2017) తేదీన ఇచ్చారని, ఇది ప్రింటింగ్ కావాలంటే కనీసం మూడు వారాల ముందు పంపించాలని తాను ఆయనతో చెప్పానని అన్నారు. అలాంటప్పుడు మీరు దానిని ప్రింటింగ్కు జనవరి (2017) తొలి వారంలో పంపించాల్సి ఉంటుందన్నారు. అలాంటప్పుడు నోట్ల రద్దు ప్రభావాన్ని ఎలా లెక్క కట్టారని తాను అడిగానని చెప్పారు.
ఒత్తిడి ఉందని చెప్పారు
దాని గురించి దాని ఆయనను ప్రశ్నించగా.. మాపై ఒత్తిడి ఉందని, మేం ఏం చేయగలమని చెప్పారని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. కాబట్టి మీరు (చార్టర్డ్ అకౌంటెంట్లు) ఈ త్రైమాసిక డాటాను విశ్వసించవద్దని స్వామి సూచించారు.