ప్రధాని పదవికి నరేంద్ర మోడీ అనర్హుడు, రాజీనామా చెయ్యాలి, రాఫెల్ డీల్: ఖార్గే!
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి పదవికి నరేంద్ర మోడీ అనర్హుడని, వెంటనే ఆయన రాజీనామా చెయ్యాలని లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి (కాంగ్రెస్) మల్లికార్జున ఖార్గే డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రుల్లో ఎవరినో ఒకరిని ప్రధానిని చెయ్యాలని మల్లికార్జున ఖార్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మల్లికార్జున ఖార్గే రాఫెల్ ఒప్పందంలో పెద్ద అవినీతి జరిగిందని ఆరోపించారు. రాఫెల్ డీల్ లో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సోవో హోలెన్ సంచలన వ్యాఖ్యలు చేశారని మల్లికార్జున ఖార్గే గుర్తు చేశారు.
రాఫెల్ డీల్ లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సోవో హోలెన్ స్వయంగా చెప్పారని, ఇక ఇంతకంటే సాక్షం ఏం కావాలని మల్లికార్జున ఖార్గే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించారు. అనీల్ అంబానికి రాఫెల్ కాంట్రాక్టు ఇప్పించడంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలకపాత్ర పోషించారని మల్లికార్జున ఖార్గే ఆరోపించారు.
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ కొనసాగడానికి ఆయనకు నైతిక హక్కు లేదని, వెంటనే రాజీనామా చెయ్యాలని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని మల్లికార్జున ఖార్గే అన్నారు. మొదటి నుంచి తాము రాఫెల్ డీల్ పెద్ద కుంబకోణం అని చెబుతూనే ఉన్నామని మల్లికార్జున ఖార్గే గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై సోషల్ మీడియాలో బీజేపీ మద్దతుదారులు స్పంధిస్తున్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ముసలి రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మళ్లీమళ్లీ ఇలాంటి ఆరోపణలు చేసి మన రక్షణ శాఖపై వివాదాలు సృష్టించరాదని కాంగ్రెస్ కు హితవు పలికారు.
సోనియా గాంధీ గత 7 రోజుల నుంచి రష్యాలో ఎందుకు ఉన్నారు ?, భారత్ లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ జోక్యం చేసుకోవాలని మీరు మంతనాలు జరుపుతున్నారా ? ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సోవో హోలెన్ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఆయనకు మీరు ఎంత డబ్బు ఇచ్చారు ? అని సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నల వర్షం కురుపిస్తున్నారు.