తుపాకులతో కాదు, భుజాలపై నాగళ్లతో కదుల్దాం: మోడీ
న్యూఢిల్లీ: ప్రధానిగా కాదు సేవకుడిగా మీ ముందుకు వచ్చానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన శుక్రవారం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించారు. అంతకు ముందు ఆయన బాపూ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఎర్రకోటలో త్రివిధ దళాల వందనం స్వీకరించి ప్రసంగించారు.
దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య స్ఫూర్తితో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిద్దామని ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రగతికి ప్రధానులందరూ కృషి చేశారని, అన్ని ప్రభుత్వాలూ పాటుపడ్డాయని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు, పాలకులు దేశ నిర్మాతలు కాదని, రైతులూ కార్మికులూ శాస్త్రవేత్తలూ, ఉపాధ్యాయులు దేశ నిర్మాతలని ఆయన అన్నారు.
మనమంతా కలిసి పనిచేద్దాం, కలిసి నడుద్దాం, కలిసి ఆలోచిద్దామని మోడీ అన్నారు. పార్టీలకన్నా దేశం మిన్న అని, అందరం కలిసి పనిచేద్దామని ఆయన అన్నారు. సంఖ్యాబలంతో కాకుండా సామరస్యవూర్వక చర్చల ద్వారా ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వమంటే వివిధ శాఖల కలయిక కాదు, ఏకోన్ముఖ పథగామి అని అన్నారు.మానవత్వానికి మంచిని దారి మరోటి లేదని ఆయన అన్నారు. హింసను విడనాడాలని ఆయన పిలుపునిచ్చారు. దేశాభివృద్ధి మన బాధ్యత కాదు, మన పూర్వీకుల కల అని ఆయన అన్నారు. ప్రతి క్షణం ప్రజా సేవలో నిమగ్నమయ్యానా, లేదా అనేదే ముఖ్యమని, తాను ఎల్లవేళలా ప్రజాహితం కోసం పనిచేస్తానని ఆయన చెప్పారు.
స్వాతంత్ర్య సమరయోధుల కలలను నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన అన్నారు. సామ్రాజ్య కాంక్షతో వచ్చిన అశోకుడు సమాజానికి శాంతి సందేశాన్నిచ్చాడని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ దేశానికి నేను ఏం చేశానని ఆలోచించాలని ఆయన అన్నారు. దేశం నాకేమిచ్చిదని కాకుండా దేశానికి నేను ఏం చేశానని ఆలోచించాలని ఆయన అన్నారు. దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలు దేశానికి తలవంపులు తెస్తున్నాయని మోడీ అన్నారు. మన భుజాలపై తుపాకులతో కాదు, నాగళ్లతో కదులుదామని ఆయన అన్నారు కులం, మతం పేరుతో హింస అభివృద్ధి నిరోధకమని అన్నారు. ఆడపిల్లలను కళ్లలో పెట్టి చూసుకుంటామని, కంటిపాపకు దెబ్బ తగిలితే హృదయం విలవిలలాడదా అని అన్నారు. స్వర్ణ భారతదేశాన్ని నిర్మిద్దామని అన్నారు.
హింసను వీడి శాంతి మార్గంలో నడిచినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. క్రీడాకారులు దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారని ఆయన అన్నారు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేసే బిడ్డులు ఉన్నారని, అలాగే తల్లిదండ్రుల కోసం పెళ్లిళ్లు మానుకున్నవారూ ఉన్నారని ఆయన అన్నారు. మేడ్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలని ఆయన అన్నారు. దేశం దిగుమతి చేసే స్థితి నుంచి ఎగుమతి చేసే దేశంగా తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు. ఎలక్ట్రిక్ నుంచి ఎలక్ట్రానిక్ వరకు మేడ్ ఇన్ ఇండియా కనిపించాలని అన్నారు.
ప్రతి ఒక్కరికీ సెల్ ఫోన్ ఉంది గానీ బ్యాంక్ ఖాతా లేదని, ప్రతి ఒక్కరినీ ప్రధాన ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరినీ ఉద్యోగం చేసే దిశగా కాకుండా ఉపాధి సృష్టించే దిశగా తీసుకుని వెళ్తానని మోడి అన్నారు. ఒకటి రెండుతో సరిపోదని, ప్రపంచ చిత్రపటం మీద భారతదేశాన్ని నిలబెట్టాలని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగమంటే దేశ సేవ కోసం అవకాశం వచ్చినట్లని ఆయన అన్నారు. అభివృద్ధిలో సమతుల్యత రావాలంటే తయారీరంగం బలోపేతం కావాలని అన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధయమని, ప్రపంచ చిత్రపటం మీద భారతదేశానికి గుర్తింపు రావాలంటే యువత సింహగర్జన చేయాలని ఆయన అన్నారు. మన ఉత్పత్తులు ప్రపంచాన్ని ముంచెత్తాలని ఆయన అన్నారు. ఐటి నిపుణులు మన శక్తి ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. సుపరిపాలన, అభివృద్ధితో ముందుకు సాగుదామని మోడీ పిలుపునిచ్చారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అనే కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. అక్టోబర్ 11వ తేదీన ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. తద్వారా అదర్శ గ్రామాలను పరిశుభ్రంం చేయనున్నట్లు ఆయన తెలిపారు. పరిశుద్ధ భారత్ కోసం ఈ యోజన పనిచేస్తుదని న్నారు. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు.
విశ్వకళ్యాణం కోసం దేశం పనిచేస్తుందని మోడీ చెప్పారు. దేశాభివృద్ధి కోసం కృషి చేస్తానని, తాను ప్రధానిగా కాకుండా ప్రధాన సేవకుడిగా పనిచేస్తానని చెప్పారు. ఈ గవర్నెన్స్ను అందిస్తామని, ఈ గవర్నెన్స్ అంటే సులభ పరిపాలన అని ఆయన అన్నారు. ప్రణాళికా సంఘాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సర్వ మానవ కళ్యాణమే భారతీయ తత్త్వమని ఆయన అన్నారు.
ఈ స్వాతంత్ర్య వేడుకలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దంపతులు, కాంగ్రెసు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తదితరులు హాజరయ్యారు.