నరేంద్ర మోడీకి ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు లేదు: సిద్ధరామయ్య
బెంగళూరు: నరేంద్ర మోడీకి ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు లేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిప్పులు చెరిగారు. లోక్పాల్పై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు ఎక్కడిదన్నారు. మోడీ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు తొమ్మిదేళ్లు లోకాయుక్త లేరని, మోడీ అవినీతికి మార్గం సుగమం చేశారన్నారు.
అలాంటి మోడీకి ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రానికి రూ.95,200 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.84,500 కోట్లు మాత్రమే వచ్చాయని, ఇంకా పదివేల కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉందన్నారు.
ఈ విషయం మోడీకి గానీ అమిత్ షాకి గాని తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్రాలకు చాలా సొమ్ములు ఇచ్చామంటూ మోడీ గొప్పలు చెప్పుకుంటున్నారని, అసలు ఆ సొమ్ము ఎక్కడిదని ప్రశ్నించారు. అవన్నీ రాష్ట్రాలు పన్నులుగా వసూలు చేసి కేంద్రానికి పంపితే అవి మళ్లీ రాష్ట్రానికి వచ్చాయన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పచ్చి అబద్దాల కోరు అని సిద్ధూ మండిపడ్డారు. జైలుకు వెళ్లిన వ్యక్తినే కర్నాటక సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రపోజ్ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రం గురించి అన్నీ అబద్దాలు చెబుతూ కన్నడిగుల ప్రతిష్టను మోడీ దెబ్బతీస్తున్నారన్నారు.