ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న షీలా, కారణం?
న్యూఢిల్లీ: మూడు సార్లు వరుసగా పదిహేనేళ్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన షీలా దీక్షిత్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. కారణం ప్రధాని నరేంద్రమోడీయేనా అంటే అవునని అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. దేశంలో ప్రస్తుతం మోడీ ప్రభంజనం వీస్తుందని... దానిని తట్టుకుని నిలబడాలంటే చాలా కష్టమని అంటున్నారు.
గత ఏడాది గడిచిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఘోర పరాభవం కూడా ఒకందుకు కారణమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బుధవారం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు.
ఢిల్లీలో నెలకొన్న ప్రతిష్టంభనకు మాత్రం, అరవింద్ కేజ్రీవాలే కారణమని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దాంతో, త్వరలో రాజధానిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించనుంది.
ఈ క్రమంలో మూడు స్థానాల్లో ఉప ఎన్నికలు జరపాలన్న ఆలోచననను ఎన్నికల కమిషన్ ఉపసంహరించుకుంది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన రాజకీయ పార్టీలు ముందుకు రాకపోవడంతో అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతికి నివేదిక సమర్పించారు.
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు ఇవాళ రాష్ట్రపతి కూడా అనుమతి తెలపడంతో త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే హర్యానా, మహారాష్ట్రలను కైవసం చేసుకున్న బీజేపీ ఇప్పుడు ఢిల్లీ పీఠంపై గురి పెట్టింది.
ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అప్పుడే కసరత్తులు మొదలుపెట్టింది. బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రణాళికలు రచించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే, ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరో ముందే ప్రకటించమని బీజేపీ స్పష్టం చేసింది. హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తర్వాతనే ముఖ్యమంత్రి పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే.