బిజెపికి మద్దతు: రేపు రజనీకాంత్తో మోడీ భేటీ
చెన్నై: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి సినీ ప్రముఖుల మద్దతు పెరుగుతోంది. తాజాగా దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్.. నరేంద్ర మోడీకి మద్దతు పలికారు. ఆదివారం మోడీ చెన్నైలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ చెన్నైలోని రజనీకాంత్ నివాసంలో ఆయనను కలవనున్నారు. రజనీకాంత్ బిజెపికి మద్దతు తెలపడంలో, మోడీ భేటీకి తుగ్లక్ పత్రిక ఎడిటర్ చో రామస్వామి సంధానకర్తగా వ్యవహరించారు.
గత కొంత కాలంగా తమిళనాడు బిజెపి శ్రేణులు చేస్తున్న ప్రయత్నాలు ఈ పరిణామంతో ఫలించినట్లుగా తెలుస్తోంది. తమ పార్టీకి మద్దతు తెలపాలని రజనీకాంత్ను గతంలోనే పలుమార్లు బిజెపి శ్రేణులు కలిశాయి. ఇప్పటివరకు తమిళనాడులో బిజెపి ప్రభావం అంతగా లేదు. కానీ ప్రస్తుతం బిజెపి హవా దేశ వ్యాప్తంగా కొనసాగుతుండటంతో తమిళనాడులో కూడా దాని ప్రభావం పడింది. నరేంద్ర మోడీకి తమిళనాడులో కూడా ఆదరణ పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో చెన్నైలో పర్యటిస్తున్న సందర్భంగా మోడీ.. రజనీకాంత్ను ఆయన నివాసంలో కలువన్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ను బిజెపికి మద్దతివ్వాలని ఈ సందర్భంగా కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ కూడా చెన్నైలోనే ఉన్నారు. అయితే మోడీ.. రజనీతో ఎంతసేపు చర్చలు జరుపుతారనే విషయాలు ఇంకా తెలియరాలేదు. గతంలో కూడా రజనీకాంత్ బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీతోపాటు నరేంద్ర మోడీని పలుమార్లు వివిధ సందర్భాల్లో కలిశారు.
బిజెపి పార్టీ సిద్ధాంతాలు అనుకూలంగా ఉండటంతో రజనీకాంత్ ఆ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, మోడీ భేటీ తర్వాతే స్పష్టమైన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒక వేళ రజనీకాంత్ బిజెపికి మద్దతు తెలిపినట్లయితే తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు లేకపోలేదు. కాగా, ఇప్పటికే తమిళనాడులోని పలు ప్రాంతీయ పార్టీలతో బిజెపి పొత్తులు పెట్టుకుంది. సినీ నటుడు, ఎండిఎంకె పార్టీ అధ్యక్షుడు విజయ్ కాంత్ కూడా బిజెపితో పొత్తు పెట్టుకున్నారు.