మోడీ స్టింగ్ ఆపరేషన్.. 400సీడీల్లో అవినీతి బ్యాంకర్ల భవితవ్యం!
బ్యాంకర్ల బ్యాక్ డోర్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రధాని మోడీ స్టింగ్ ఆపరేషన్ చేయించినట్టుగా తెలుస్తోంది.
న్యూఢిల్లీ: నల్లకుబేరుల ఆగడాలకు చెక్ పెట్టడానికి ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం.. కొంతమంది బ్యాంకర్లు కమిషన్ల కక్కుర్తికి పాల్పడుతుండటంతో నీరుగారి పోతుందన్న వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే దేశంలోని చాలామంది బడాబాబుల వద్ద పెద్ద నోట్ల కట్టలు బయటపడుతుండటం బ్యాంకర్లపై అనుమానాలు రేకెత్తిస్తోంది. అయితే బ్యాంకర్ల బ్యాక్ డోర్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ముందుచూపుతోనే వ్యవహరించినట్టుగా తెలుస్తోంది.
'మోడీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశారు కాబట్టి... దొడ్డిదారిన ఏదో ఒకటి చేయొచ్చని బ్యాంకు అధికారులు కొందరు భావించారు. అయితే మోదీ వెనక గేట్ల వద్ద కెమేరాలు పెట్టిన సంగతి వారికి తెలియదు. ఒక్కర్నీ వదిలిపెట్టకుండా వారందర్నీ అరెస్టు చేస్తాం' అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. నల్లకుబేరులకు సహకరించిన బ్యాంకర్ల చిట్టా కేంద్రానికి అంది ఉండవచ్చునని తెలుస్తోంది.
ఇందుకోసం స్వయంగా ఐటీ అధికారులే ఖాతాదారుల ముసుగులో బ్యాంకర్ల వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి బ్యాంకర్ల పనితీరుపై ప్రధాని మోడీ స్టింగ్ ఆపరేషన్ చేపట్టారన్న వాదన బలంగా వినిపిస్తోంది. సాధారణ ప్రజల ఐడీ కార్డులతోనే పలువురు నల్లకుబేరులు పలుమార్లు తమ నల్లడబ్బును మార్పిడి చేసుకున్నట్టుగా కేంద్రానికి నివేదికలు అందినట్టు సమాచారం.
నల్లకుబేరుల బ్యాంకర్ల చిట్టాను ఇప్పటికే సిద్దం చేసిన ఆర్థికశాఖ.. దీనికి సంబంధించిన 400 సీడీలను కేంద్రానికి పంపించినట్టగా తెలుస్తోంది. బ్యాంకర్లు ఎలా సహకరించింది? నల్లకుబేరులు తమ డబ్బును ఎలా మార్చుకున్నది? ఈ సీడీల్లో రికార్డయినట్టుగా చెబుతున్నారు. ఇదే గనుక నిజమైతే అక్రమాలకు పాల్పడిన బ్యాంకర్లపై వేటు పడక తప్పదు.