కొత్తగా కొలువు దీరిన నరేంద్ర మోదీ ప్రభుత్వం..! ఎన్నో ఆసక్తికర అంశాలు..!!
ఢిల్లీ/హైదరాబాద్ : కేంద్రంలో వరుసగా రెండోసారి బాధ్యతలను నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలో 2014లో మోదీ టీం తో పోలిస్తే ఎన్నో ప్రత్యేకతలు ప్రస్తుత టీం కలిగిఉంది. మంత్రివర్గంలో చోటుదక్కని ప్రముఖుల్లో మేనకాగాంధీ, రాధామోహన్ సింగ్, జయంత్ సిన్హా, అనుప్రియా పటేల్, రామ్ కృపాల్ యాదవ్, రాజవర్థన్ సింగ్ రాథోడ్, అనంత్ కుమార్ హెగ్డే తదితరులు ఉన్నారు. గత కేబినెట్ లో మంత్రులుగా ఉండి ఓడిపోయిన వారిలో మనోజ్ సిన్హా, అల్ఫోన్స్ కన్నంతనమ్, హన్స్ రాజ్ ఆహిర్లు.
గత కేబినెట్ లో మంత్రులుగా ఉండి, ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వారిలో సురేష్ ప్రభు, సుష్మా స్వరాజ్, ఉమా భారతి, బీరేంద్ర సింగ్, అరుణ్ జైట్లీ - ఓడిపోయినప్పటికీ పదవిని దక్కించుకున్న ఎంపీగా హర్దీప్ సింగ్ పురి నిలిచారు. గత కేబినెట్ లో మంత్రిగా ఉండి టికెట్ ను పొందలేకపోయిన వ్యక్తిగా నిలిచిన విజయ్ సంప్లా. గత కేబినెట్ లో ఎనిమిది మంది మహిళలుండగా, ఈ దఫా 6కు తగ్గిన మహిళల సంఖ్య. గరిష్ఠంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన తొమ్మిది మందికి మంత్రి పదవులు లభించాయి.
నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి చోటు దక్కింది. సికింద్రాబాద్ నుంచి లోక్ సభ స్థానానికి ఎంపికైన ఆయన మంత్రివర్గంలో చేరారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఏకైక తెలుగు వ్యక్తి కిషన్ రెడ్డి కావడం గమనార్హం. సికింద్రాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికైన ఆయన తొలిసారే మంత్రి పదవిని దక్కించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకటే స్థానానికి పరిమితమైన బీజేపీ.. లోక్ సభ ఎన్నికల్లో అద్భుతంగా పుంజుకుంది. 4 లోక్ సభ స్థానాలను ఖాతాలో వేసుకుంది.
టీఆర్ఎస్ పార్టీకి పెట్టని కోటలా ఉన్న కరీంనగర్తో పాటు నిజామాబాద్లో సీఎం కేసీఆర్ సొంత కూతురు కవితను సైతం బీజేపీ ఓడించడం ఆశ్చర్యం కలిగించింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపుతో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం పట్ల ఫోకస్ పెట్టిన బీజేపీ.. కిషన్ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకుంది. 2014లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన బండారు దత్తాత్రేయకు కూడా మోదీ మంత్రివర్గంలో చోటు దక్కింది.