కాశ్మీరీలకు మోడీ హామీ, 800 ఏళ్ల తర్వాత హిందూ..
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ అంటే తన గుండెల్లో ప్రత్యేక అభిమానం ఉందనీ, అటల్ బిహారీ వాజపేయి స్వప్నాన్ని సాకారం చేసేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అన్నారు. రాష్ట్రంలో తొలి ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యం, మానవత్వం, కాశ్మీరీయత సూత్రాల పునాదిగా వాజ్పేయి గతంలో చెప్పిన మాటలకు కాశ్మీరీల హృదయాలలో ప్రత్యేక స్థానం ఉందన్నారు.
వాజపేయి ప్రసంగాలు సగటు కాశ్మీరీ యువత ఉజ్వల భవితపై ఆశలను చిగురింప జేశాయన్నారు. తన మాటలను విశ్వసించి బీజేపీకి పూర్తి మెజారిటీతో అధికారం అప్పగిస్తే తన శక్తినంతటినీ ఉపయోగించి వాజపేయి కలను సాకారం చేస్తానన్నారు. రాజకీయాలను మతంతో జోడించే ప్రయత్నాలు మంచిది కాదన్నారు.
కాశ్మీరీ ఎప్పటికీ కాశ్మీరీయేనన్నారు. మా మంత్రం అభివృద్ధి, అభివృద్ధి. అభివృద్ధి అని నొక్కి చెప్పారు. తన మీద నమ్మకముంచితే కాశ్మీర్ను అభివృద్ధి చేసి వడ్డీతో సహా రుణం తీర్చుకుంటానన్నారు. ఓమర్ అబ్దులాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబ ముఫ్తీ సయీద్ నేతృత్వంలోని పీడీపీ కుటుంబ పార్టీలు కాశ్మీర్ను ఏళ్ల తరబడి దోచుకున్నాయని, ఇకనైనా ఆ రెండు పార్టీలను శిక్షించాలన్నారు.
కాశ్మీర్ను ఎప్పటికీ ఆ రెండు కుటుంబాలే పాలించాలా? ఇతర కుటుంబాల నుంచి నేతలు లేరా? మీరు గత 50 ఏళ్లుగా పశ్చాత్తాపపడుతున్నారని, ఆ రెండు కుటుంబ పార్టీలను శిక్షించకపోతే ఆవి మళ్లీ బలపడతాయన్నారు. ఈ రాష్ట్రంలో అవినీతిని అంతమొందించేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. తమపై నమ్మకముంచి ఈ కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
800 ఏళ్ల తర్వాత ఢిల్లీలో హిందూ రాజ్యం
లౌకిక శక్తులకు విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ చురకలంటించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడురు. దేశ రాజధానిలో నిర్వహిస్తున్న ప్రపంచ హిందూ మహాసభలో ప్రసంగిస్తూ... ఎనిమిది వందల ఏళ్ల తర్వాత ఢిల్లీ హిందువుల పాలనలోకి వచ్చిందన్నారు.
మోడీ ప్రధానిగా ఎదగడాన్ని భారత ఉపఖండంలో చివరి హిందూ రాజుగా పరిగణించే పృథ్వీరాజ్తో పోలుస్తూ ఆయనీ మాటలన్నారు. ఢిల్లీని ఇప్పుడు హిందువుగా గర్వించే వ్యక్తి పాలిస్తున్నాడని, ఆనాడు పృథ్వీరాజ్ నుంచి అధికారం చేజారిన తర్వాత మళ్లీ హిందువు చేతికి పగ్గాలు రావడానికి 800 ఏళ్లు పట్టిందన్నారు.
సంస్కృతం మన దేశ భాషని, వెయ్యేళ్ల కిందట ఈ భాషలోనే అంతా రాశారన్నారు. సంస్కృతాన్ని నిర్మూలించడమంటే భారత్నే నిర్మూలించడమని స్పష్టం చేశారు. హిందూ సమాజం మరింత విస్తృత పాత్ర పోషిస్తూ ప్రపంచానికి మార్గదర్శనం చేయాలని ఆరెస్సెస్ సర్ సంఘ్చాలక్ మోహన్ భాగవత్ ఆకాంక్షించారు. మహాసభలో పాల్గొన్న టిబెట్ బౌద్ధ గురువు దలైలామా మాట్లాడుతూ... బౌద్ధం, హిందూత్వం సోదర ఆధ్యాత్మిక భావనలన్నారు.