రెండో సారి ప్రధానిగా మోడీ తొలిభేటీ ఆ దేశాధ్యక్షుడితోనే..!
కేంద్రంలో రెండో సారి మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇక మోడీ ప్రధానిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేశాకా నేరుగా విధుల్లోకి దిగనున్నారు. రెండో సారి ప్రధాని అయ్యాక తన తొలి అంతర్జాతీయ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కలవనున్నారు. బెషెక్లో జరగనున్న షాంఘై సహకార సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ జిన్పింగ్తో భేటీ కానున్నారు. జూన్ 14 నుంచి 15 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి.
ఈ సమావేశం సందర్భంగా భారత్-సీనో బంధాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 2018 వుహాన్ సమావేశం తర్వాత భారత్-సీనో బంధాలపై అడుగు ముందుకు పడలేదు. మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక భారత్ చైనా దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశానికి ఈ సమావేశం ఒక వేదికగా నిలువనుంది. ఇక చైనా అధ్యక్షుడు కూడా ఈ ఏడాది చివర్లో భారత్ పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. చైనా-అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్ - చైనా ఆర్థిక బలోపేతానికి పావులు కదుపుతుండటంతో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక భారత్-చైనాల అధినేతల సమావేశంలో కొన్ని అంశాలు చర్చకు రాకపోవచ్చు. ఇందులో సరిహద్దు సమస్య, వాణిజ్యం మధ్య సుదీర్ఘ దూరం ఏర్పడటం, చైనా నుంచి పాకిస్తాన్కు కారిడార్ వంటి సమస్యలపై చర్చజరిగే అవకాశం లేదు.అంతకుముందు బ్రిక్ సమావేశాన్ని భారత్ బహిష్కరించింది. ఇక షాంఘై సహకార దేశాల మధ్య జరిగే భేటీ తర్వాత పక్షం రోజులకు జపాన్లోని ఓసాకాలో జరిగూ జీ-20 సదస్సులో మళ్లీ మోడీ, జిన్పింగ్లు కలిసే అవకాశం ఉంది. ఇక షాంఘై సమావేశంలో భారత ప్రధాని మోడీ పాల్గొంటుండగా... పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.