నరేంద్ర మోడీని భాష మార్చుకోమని చెప్పండి: మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని తన భాషను మార్చుకోమని చెప్పాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి వారు లేఖ రాశారు. కర్ణాటక ఎన్నికల్లో భాగంగా మే 6న హుబ్బెళ్లిలో నిర్వహించిన ప్రచార సభలో కాంగ్రెస్నుద్దేశించి మాట్లాడినప్పుడు ఆయన ఉపయోగించిన భాష తమకు అభ్యంతరకరంగా ఉందన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో భాగంగా మోడీ హుబ్బెళ్లి పర్యటనలో కాంగ్రెస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, అప్పుడు ఆయన వాడిన భాష కూడా ఏం బాగాలేదని, అవి ఒక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదని, ఆయన భాషకు హాని కలిగిస్తున్నారని, దేశంలో ప్రతిష్టాత్మక హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడితే ఎలాగని, ప్రజలు ఆయనను గమనిస్తుంటారన్నారు.
ఆయనను కాస్త భాష మార్చుకోమని చెప్పాలని హితబోధ చేశారు. మోడీ హద్దులు దాటి మాట్లాడుతున్నారని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. లేఖతో పాటు ప్రచారంలో మోడీ మాట్లాడిన వీడియో లింక్ను జత చేసి పంపించారు.
ఈ లేఖలో మన్మోహన్తో పాటు కాంగ్రెస్ నేతలు చిదంబరం, ఆనంద్ శర్మ, అంబికా సోని, మల్లికార్జున ఖర్గే, మోతీలాల్ వోహ్రా, కమల్నాథ్, అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, కరణ్ సింగ్లు సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, దేశంలోకెల్లా అత్యంత ప్రాచీన పార్టీ కాంగ్రెస్ అని, ఇన్నేళ్ల కాలంలో మా పార్టీ చాలా ఒడిదుడుగులు ఎదుర్కొందని, అయినా ఎక్కడా తగ్గలేదన్నారు. పార్టీ ధైర్యంగా ముందుకు సాగిందన్నారు.