మోడీ: నాడు ఆర్టికల్ 370 రద్దు కోసం ధర్నా, లాఠీ దెబ్బలు..నేడు దర్జాగా!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఇది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరుసగా రెండోసారి మనదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతి కొద్దిరోజుల్లోనే తీసుకున్న అతి సున్నిత, కీలక అంశం ఆర్టికల్ 370 రద్దు చేయడం. దేశ ప్రధానిగా రెండోదఫా పగ్గాలను అందుకున్న రెండు నెలల వ్యవధిలోనే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకోవడం సాహసోపేతంగా అభివర్ణిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం చారిత్రాత్మకమని అంటున్నారు విశ్లేషకులు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా- జమ్మూ కాశ్మీర్ ఓ కేంద్ర పాలిత ప్రాంతంగా.. లడక్ మరో కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించబోతున్నాయి.
త్వరలో అఖండ భారతావని: నేడు కాశ్మీర్..రేపు పాక్ ఆక్రమిత్ కాశ్మీర్: కేంద్రం చేతుల్లో పరిపాలన
రోడ్డెక్కి..లాఠీ దెబ్బలు తిని..
ఇదే ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరుతూ నరేంద్ర మోడీ గతంలో ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. రోడ్డెక్కి నినదించిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. రిలే నిరాహార దీక్షలను నిర్వహించిన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘ్ సంచాలక్ గా ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఘటనలు చాలా ఉన్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. `370 హఠావో..ఆతంక్ వాద్ మిటావో..దేశ్ బచావో `(ఆర్టికల్ 370ని రద్దు చేయండి.. ఉగ్రవాదాన్ని తరిమి కొట్టండి..దేశాన్ని రక్షించండి) అనే నినాదంతో ఆయన గతంలో తన ఉద్యమాలను కొనసాగించారు. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు.. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరుతూ నరేంద్ర మోడీ చాలా సార్లు ఉద్యమాలను నిర్వహించారు. లాఠీ దెబ్బలను రుచి చూశారు.
దర్జాగా రద్దు..
కాలచక్రం గిర్రున తిరిగేటప్పటికీ.. ఓడలు బండ్లు అయ్యాయి. బండ్లు ఓడలు అయ్యాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరుతూ ఉద్యమాలు నిర్వహించడమే కాకుండా, లాఠీ దెబ్బలను తిన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు. అదను చూసి దీనిపై విరుచుకుపడ్డారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే దీన్ని రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్ కు కేంద్ర పాలిత ప్రాంత హోదాను కట్టబెట్టారు. పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం జమ్మూ కాశ్మీర్ ను విభజించారు. జమ్మూ కాశ్మీర్ ఓ కేంద్ర పాలిత కేంద్రగా.. చైనాతో సరిహద్దులను పంచుకుంటున్న పహాడీ ఇలాకా (కొండప్రాంతం) లడక్.. మరో కేంద్ర పాలిత ప్రాంతంగా మారిపోబోతున్నాయి. దీన్ని చారిత్రాత్మక చర్యగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు.
కేంద్ర పాలిత ప్రాంతాలుగా
కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జమ్మూ కాశ్మీర్ ముఖ చిత్రం సమూలంగా మారిపోనుంది. జమ్మూ కాశ్మీర్ విడిపోనుంది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించబోతోంది.. జమ్మూ కాశ్మీర్ ఓ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు కానుండగా.. మారుమూల కొండ ప్రాంతం లడక్ మరో కేంద్ర పాలిత ప్రాంతంగా మారుతుంది. జమ్మూ కాశ్మీర్ ను రాష్ట్రంగా గుర్తిస్తూ, దానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం ఉదయం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక జమ్మూ కాశ్మీర్ పరిపాలన కేంద్రం చేతుల్లో..
ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లోని కొంత భాగాన్ని పాక్ ఆక్రమించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం ప్రత్యేక దేశంగా ఆవిర్భవించినప్పటికీ.. అది పొరుగు దేశ ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోంది. ముజప్ఫరాబాద్ ఆ దేశానికి రాజధాని. తాజాగా- జమ్మూ కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేసిన కేంద్రం దాని పరిపాలనా వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో ఇకపై చీమ చిటుక్కుమన్నా దాని బాధ్యత కేంద్రానిదే అవుతుంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. శాంతిభద్రతల వ్యవహారాలన్నీ కేంద్రం చేతుల్లోనే ఉంటాయి. ప్రభుత్వం ఉన్నప్పటికీ.. నామమాత్రమే అవుతుంది. అదే లడక్ లో ప్రభుత్వం కూడా ఉండదు. ప్రజా ప్రతినిధులు అసలే ఉండరు.