అల్లాకు 99 పేర్లు ఉన్నా..: మోడీ నోట ఖురాన్, బైబిల్
న్యూఢిల్లీ: అల్లాకు 99 పేర్లు ఉన్నాయని, దేంట్లోను హింస లేదని, ఉగ్రవాదంపై పోరు అంటే ఏ మతంతోను ఘర్షణ కాదని, కాకూడదని ప్రధాని మోడీ అన్నారు. తీవ్రవాదాన్ని, మతాన్ని వేరుగా చూడాలన్నారు.
వరల్డ్ సూఫీ ఫోరంలో ప్రధాని మోడీ పాల్గొని, ప్రసంగించారు. అల్లాకు ఉన్న 99 పేర్లలో ఏ ఒక్కటి కూడా హింసను ప్రేరేపించేది కాదన్నారు. నాలుగు రోజుల పాటు సాగనున్న వరల్డ్ సుఫీ ఫోరమ్ సమావేశాల్లో తొలిరోజున పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ... పాకిస్థాన్ పేరును ప్రస్తావించకుండానే చురకలు వేశారు.
సూఫీజం ప్రేమకు పుట్టినిల్లని, ఉగ్రవాదానికి సహకరించదన్నారు. సరిహద్దు దేశాల్లో ఇదే జరిగితే, ఉపఖండం ఈ భువిపైనే స్వర్గంతో సమానమవుతుందన్నారు. ఉగ్రవాదం మనల్ని విడగొట్టి నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాలంలో ఉగ్రవాదం, తీవ్రవాదం సమాజం ముందు సవాళ్లను విసురుతున్నాయన్నారు. అన్నారు.
ప్రధాని మోడీ
ప్రతి సంవత్సరమూ ఉగ్రవాదాన్ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని, గత సంవత్సరం 90 దేశాలు ఉగ్రదాడులకు గురయ్యాయని ప్రధాని మోడీ గుర్తు చేశారు. సిరియాలో జరుగుతున్న యుద్ధంలో తమ బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు నిత్యమూ ఆ బాధను అనుభవిస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ప్రధాని మోడీ
మన ప్రజలలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్దులు, పార్సీలు, నమ్మేవాళ్లు, నమ్మని వాళ్లు... ఇలా రకరకాల వాళ్లున్నారని, వీరంతా భారతావనిలో భాగమేనని ప్రధాని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం అన్నారు. ఈ భిన్నత్వంలోనే సూఫిజం పుట్టి భారతావనిలో విరాజిల్లిందన్నారు.
ప్రధాని మోడీ
శాంతికి సంకేతం ఇస్లాం అని, సూఫీతత్వానికి అంతర్జాతీయ ప్రాధాన్యం ఉందని, మతాలు ప్రవచించే విలువల ఆధారంగా ఉగ్రవాదంపై పోరాడాలని ప్రధాని సూచించారు. అరగంట పాటు మాట్లాడిన ప్రధాని మోడీ.. అల్లా నామాల్లో తొలి రెండూ ఎంతో దయాపూరితమైనవన్నారు. అల్లా అంటే రహమాన్, అల్లా అంటే రహీమ్ అన్నారు.
ప్రధాని మోడీ
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి ఏటా ప్రపంచవ్యాప్తంగా రూ.6,64,500 కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి వస్తోందని, అంత పెద్ద మొత్తాన్ని నిరుపేదల జీవితాల్ని బాగు చేయటానికి ఉపయోగిస్తే అద్భుతాలు జరుగుతాయన్నారు. పాకిస్థాన్లో కొనసాగుతున్న ఉగ్రవాదసంస్థలపై పరోక్షంగా విమర్శలు సంధిస్తూ.. దేశ విధానాలను నిర్ణయించే విధంగా కొన్ని శక్తులు, సంస్థలు పని చేస్తున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
ప్రధాని మోడీ
కొందరు ఉగ్రవాదులు శిబిరాల్లో శిక్షణ పొందుతుంటే.. మరికొందరు ఇంటర్నెట్లో జరిగే ప్రచారంతో ఆకర్షితులవుతున్నారంటూ ఇస్లామిక్ స్టేట్లో వివిధ దేశాల యువత చేరటాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఏ మతం కోసమైతే తాము పోరాడుతున్నామని ఉగ్రవాదులు చెప్పుకొంటారో ఆ మతానికి వారు స్వయంగా నష్టం చేస్తుంటారని ప్రధాని మోడీ తెలిపారు.
ప్రధాని మోడీ
ఇతర ప్రాంతాల్లో చేసే హత్యలు, విధ్వంసంకన్నా తమ సొంతప్రాంతంలోనే వాళ్లు ఎక్కువ మందిని చంపుతుంటారని, ఎక్కువ విధ్వంసానికి పాల్పడతారని చెప్పారు. హింసాకాండను ఎదుర్కోవటానికి అన్ని మతాల్లోని సారాన్ని తీసుకోవాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖురాన్, బైబిల్లోని బోధనలను, బుద్ధుడు, మహావీరుడు చాటిచెప్పిన అహింసా సిద్ధాంతాన్ని, పలువురు సూఫీతత్వవేత్తల కృషిని ప్రధాని మోడీ గుర్తు చేశారు.