యువత మంచిదే, డ్రగ్స్ మంచివి కావు: మోడీ 'మన్ కీ బాత్'
న్యూఢిల్లీ: యువత మంచిదేనని, కానీ మత్తుపదార్థాలు మంచివి కావని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తన మన్ కీ బాత్లో ఆన్నారు. పలువురు యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కావడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇందుకు యువతను మాత్రమే నిందించి ప్రయోజనం లేదన్నారు.
సమాజంలో మత్తుపదార్థాలు లభ్యం కాకుండా చూడాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసైన వారిని విముక్తి కలిగించేందుకు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. సమజాన్ని మత్తుపదార్థాలు నాశనం చేయడాన్ని తాను గమనిస్తున్నానని చెప్పారు.
మత్తుపదార్థాలకు బానిస కావడాన్ని ఒంటరిగా నిరోధించలేమన్నారు. సమష్టి కృషితో మత్తు పదార్థాల వాడకాన్ని నిరోధించగలమన్నారు. మత్తు పదార్థాలపై ఫోకస్ చేస్తున్నందుకు మీడియాకు ధన్యవాదాలు అన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనం యువతను అంధకారంలోకి నెడుతోందన్నరు.
యువత అభివృద్ధిని ధ్వంసం చేస్తోందన్నారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల సమస్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దీనిని అరికడతామన్నారు. వీటి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనాల్ని మానసిక రుగ్మతగా పరిగణించాలన్నారు. యువతలో చైతన్యం కలిగించేందుకు సినీ ప్రముఖులు, క్రీడాకారులు ముందుకు రావాలన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం గర్వకారణమన్నారు.
మీవల్లే నాకీ గౌరవం
ప్రపంచవ్యాప్తంగా తనకు గౌరవం లభిస్తోందంటే అది తన గొప్పతనం కాదని, ఈ దేశ ప్రజల గొప్పతనమని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఎన్నికల ప్రచారంలో అన్నారు. భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించడం ప్రారంభించందంటే దానికి మోడీ కారణం కాదని, 125 కోట్ల మంది భారతీయులే అన్నారు.
ప్రపంచ నేతలు నాతో కరచాలనం చేసేటప్పుడు నా వెనక ఉన్న 125 కోట్ల మంది ప్రజలను చూస్తున్నారని శనివారం జమ్మూలోని సరిహద్దు పట్టణమైన కతువాలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో చెప్పారు. దేశాన్ని పాలించడానికి నాకు స్పష్టమైన ప్రజల తీర్పు లభించినందువల్లనే ఈ గౌరవమని, మాకు స్పష్టమైన తీర్పు రాకుండా ఉండి ఉంటే ప్రపంచం మన వైపు చూసి ఉండేది కాదన్నారు.అని ఆయన అన్నారు.
జమ్ము కాశ్మీర్లో ఈసారి బిజెపికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం, గుర్తింపు లభిస్తాయన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ లేదా పిడిపి ఇలా రాష్ట్రంలో ఏర్పాటయిన ప్రతి ప్రభుత్వంలోను కాంగ్రెస్ చొరబడిందని, అయితే ఎన్నికలకు ముందు ఆ ప్రభుత్వాలనే విమర్శించడం చేస్తోందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు కాంగ్రెస్, ఎన్సీపీ, పిడిపిలే కారణమని ఆయన దుయ్యబడుతూ, ఈ ముగ్గురు దోషులను శిక్షించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. ఈ దోషులను ఒకసారి శిక్షిస్తే తప్ప అవి తమ తప్పులను తెలుసుకోలేవు. జమ్మూ, కాశ్మీర్లో బీజేపీ ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందా? మేము ఎప్పుడయినా ఏ తప్పైనా చేసామా? మొదటి దోషి, రెండో దోషి, మూడో దోషి ఎవరో మీకు తెలియదా? అని మోడీ ప్రజలను ప్రశ్నించారు. అప్పుడు జనం పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.