ప్రధానిగా నరేంద్ర మోడీ అనర్హుడు, ఏం చేశారు, సిగ్గుండాలి: కర్ణాటక సీఎం సిద్దరామయ్య!
బళ్లారి/బెంగళూరు: భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ అనర్హుడని, ఆయన వలన ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని, కేంద్ర ప్రభుత్వం కారణంగా దేశంలోని మైనారిటీలు కష్టాలు ఎదుర్కొంటున్నారని, అలాంటి పార్టీలను ఆదరించరాదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలోని హోస్ పేట్ లో శనివారం జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభ సమావేశంలో సీఎం సిద్దరామయ్య మోడీ ఆరోపణల మీద ఏమైనా మాట్లాడితే సిగ్గుండాలి అంటూ సిద్దరామయ్య మండిపడ్డారు.
మోడీ పక్కనే ఆరోపి
బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన బీఎస్. యడ్యూరప్పను పక్కన పెట్టుకుని మాట్లాడుతూ కాంగ్రెస్ 10 శాతం కమిషన్ ల ప్రభుత్వం అని విమర్శించారని, ఆమాటలు అనడానికి ఆయనకు సిగ్గుండాలని సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. ప్రధానిగా నరేంద్ర మోడీ అనర్హుడని మరోసారి సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.
రెడ్డి బ్రదర్స్ లూటీ
బళ్లారిలో గతంలో భయానక వాతావరణం ఉండేది. బళ్లారి సంపద, గనులను బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ లూటీ చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. అందుకే తాను బెంగళూరు నుంచి బళ్లారికి పాదయాత్రం చేసి బళ్లారి బ్రదర్స్ కు అధికారంలో వస్తామని అప్పట్లో చాలెంజ్ చేశానని, బీజేపీ పతనం అప్పుడే మొదలైయ్యిందని సిద్దరామయ్య అన్నారు.
రెడ్డి బ్రదర్స్ అంటే భయం
బళ్లారి ప్రజలకు రెడ్డి బ్రదర్స్ ను చూస్తే భయం అని సిద్దరాయ్య ఆరోపించారు. నవ కర్ణాటక నిర్మాణం జరగాలంటే మళ్లీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అందుకు మీరందరూ ఆశీర్వదించాలని సీఎం సిద్దరామయ్య మనవి చేశారు. బళ్లారిలోని 9 శాసన సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తోందని సీఎం సిద్దరామయ్య జోస్యం చెప్పారు.
బీజేపీ మాత్రం వద్దు
కర్ణాటకలో బీజేపీ మాత్రం అధికారంలోకి రాకుండా ప్రజలు జాగ్రత్త పడాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. ఎందుకంటే ఆ పార్టీలో మనస్థత్వం ఉన్న వారు ఒక్కరూ లేరని, మత ఘర్షణలు రెచ్చగొట్టి లాభం పొందాలని చూస్తారని సీం సిద్దరామయ్య ఆరోపించారు.
కేంద్ర మంత్రిపై విసుర్లు
కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మీద సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. కేంద్ర అనంత్ కుమార్ హెగ్డే కనీసం గ్రామపంచాయితీ సభ్యుడిగా పని చెయ్యడానికి కూడా పనికిరాడని, నోటివచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని సిద్దరామయ్య విమర్శించారు.
ప్రముఖులు
లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ వేణుగోపాల్, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్, కేంద్ర మాజీ మంత్రి వీరప్పమెయిలీ, కేపీసీసీ ఎన్నికల ప్రచార కమిటి ఇన్ చార్జ్, మంత్రి డీకే. శివకుమార్, రెబల్ స్టార్ అంబరీష్, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి దినేష్ గుండూరావ్, అనీల్ లాడ్, మాజీ మంత్రి ఆనంద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.