‘‘పారిశద్ధ్యం కూడా ఆరాధనే, మరుగుదొడ్డికి శంకుస్థాపన చేయడం నా అదృష్టం..’’
‘‘ఓ పబ్లిక్ టాయిలెట్కు శంకుస్థాపన చేయడం నాకు దక్కిన మంచి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పారిశుధ్యం కూడా నాకు ఆరాధన లాంటిదే. దేశంలోని పేద ప్రజలను అనేక వ్యాధుల నుంచి ఇది విముక్తి కలిగిస్తుంది...’’
వారణాసి: పారిశుధ్యం కూడా తనకు ఆరాధనేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. పేద ప్రజలను అనేక వ్యాధుల నుంచి విముక్తి చేస్తున్నందునే తాను అలా భావిస్తానన్నారు. సొంత నియోజకవర్గం వారణాసిలో రెండో రోజు పర్యటించిన ఆయన, షాహన్షాపూర్ గ్రామంలో ఓ మరుగుదొడ్డికి శంకుస్థాపన చేశారు.
అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ... ''ఓ పబ్లిక్ టాయిలెట్కు శంకుస్థాపన చేయడం నాకు దక్కిన మంచి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పారిశుధ్యం కూడా నాకు ఆరాధన లాంటిదే. దేశంలోని పేద ప్రజలను అనేక వ్యాధుల నుంచి ఇది విముక్తి కలిగిస్తుంది. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల కారణంగా ప్రబలే వ్యాధులతో ఆర్ధికంగా కుంగిపోకుండా కాపాడుతుంది..'' అని వివరించారు.
చెత్త అంటే ఇష్టం లేకపోయినా...
చెత్త అంటే ఎవరికీ ఇష్టం లేకపోయినప్పటికీ... దేశంలోని అందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచే బాధ్యత నుంచి మాత్రం దూరంగా ఉంటున్నారని మోడీ విచారం వ్యక్తం చేశారు. ‘‘ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ప్రతి కుటుంబం తన పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనం స్వచ్ఛ గ్రామాలను, స్వచ్ఛ పట్టణాలను, స్వచ్ఛ దేశాన్ని నిర్మించగలుగుతాం...'' అని ఆయన పేర్కొన్నారు.
అందరూ బాధ్యులే...
2022 నాటికల్లా స్వతంత్ర్య భారతావనికి 75 ఏళ్లు నిండుతున్నందున.. అప్పటికల్లా దేశాన్ని మెరుగుపరుస్తామని ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవాలి..'' అని ప్రధాని పిలుపునిచ్చారు. దేశంలో కోట్లాది మంది ప్రజలకు ఇంకా నిలువనీడ లేదనీ... నిరుపేదలు సొంత ఇళ్లలో నివసించేలా చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ‘‘కాబట్టి 2022 నాటికల్లా ఓ బృహత్తర బాధ్యతను నెరవేర్చాలని మేం నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం ఇళ్లు లేని పేదలందరికీ పట్టణం, గ్రామాలతో నిమిత్తం లేకుండా సొంత ఇల్లు నిర్మించి తీరతాం...'' అని ప్రధాని స్పష్టం చేశారు.
అభివృద్ధి చేయడమే అసలు రాజకీయం...
పరిపాలన అంటే రాజకీయం చేయడమో.. లేక ఎన్నికలు గెలవడమో కాదు అని, దేశాన్ని అభివృద్ధిపరచడమే తమ పార్టీ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన నియోజకవర్గమైన వారణాసిలోని షహెన్షాపూర్లో పర్యటించిన మోడీ అక్కడ పశు ఆరోగ్య మేళాను ప్రారంభించారు. రైతులకు రుణమాఫీ సర్టిఫికెట్లను అందజేశారు.
సీఎం యోగిపై ప్రశంసలు...
ఆ తర్వాత ప్రధాని మాట్లాడుతూ.. పార్టీ కన్నా దేశమే గొప్పదని అన్నారు. పశుధన్ మేళాను ఏర్పాటు చేసిన యూపీ సీఎం యోగిపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. 2022లోపు దేశంలోని ప్రతి పేదకు ఇల్లు కట్టిస్తామన్నారు. గత ప్రభుత్వాలు పేద ప్రజలను ఆదుకోవడంలో విఫలం అయ్యాయని మోడీ పేర్కొన్నారు.