మోడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యూపీఏ కుట్ర: ఇష్రత్ జహాన్ కేసుపై డీజీ వంజరా సంచలనం
న్యూఢిల్లీ: మాజీ ఐపీఎస్ అధికారి డీజీ వంజరా తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించినట్లు మాజీ ఐపీఎస్ అధికారి డీజీ వంజరా ఆరోపించారు.
ఇష్రత్ జహాన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో సీబీఐ ఛార్జిషీటు రాజకీయ ప్రేరేపితమని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంజరా అన్నారు. తనను ఈ ఆరోపణల నుంచి విముక్తి చేయాలని వంజరా మంగళవారం స్పెషల్ సీబీఐ కోర్టును కోరారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన పిటిషన్లో మోడీ ప్రభుత్వాన్ని యూపీఏ ప్రభుత్వం అస్థిరపరిచేందుకు ప్రయత్నించిందని.. సీఎంగా ఉన్నప్పుడే మోడీని దర్యాప్తు అధికారులు ప్రశ్నించారని తెలిపారు.
వంజరా దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లో యూపీఏ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2004లో జరిగిన ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్పై సీబీఐ దర్యాప్తు రాజకీయ ప్రేరేపితమని తెలిపారు. బీజేపీని తప్పుడు పద్ధతిలో ఇరికించే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం ఈ కేసులో దర్యాప్తు నిర్వహించిందని ఆరోపించారు.
అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కూడా దర్యాప్తు అధికారులు ప్రశ్నించారని, అయితే ఆ వివరాలను రికార్డుల్లో పేర్కొనలేదని చెప్పారు. గుజరాత్లో ప్రజాస్వామికంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని యూపీఏ ప్రభుత్వం కూలదోయడానికి కుట్ర పన్నిందని, సీబీఐ ఛార్జిషీటు రాజకీయ ప్రేరేపితమని పునరుద్ఘాటించారు.