మోడీకి విజయకాంత్ జై, జయలలితపై ఫైర్: కేజ్రీపై బిజెపి
తమిళనాడులో అన్నాడిఎంకె సారథ్యంలో ప్రభుత్వానికి పారిశ్రామిక అభివృద్ధిపై శ్రద్ధలేదని విజయ్కాంత్ విరుచుకుపడ్డారు. మద్యం అమ్మకాలు పెంచుకుని ప్రజల ఆరోగ్యాలు, ముఖ్యంగా యువతను పాడుచేయడమే జయలలిత ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. అధికార అన్నాడిఎంకెకు పారిశ్రామికీకరణపై ఒక స్పష్టమైన విధానం లేదని, పారిశ్రామిక అభివృద్ధి పథకాలు అమలును పట్టించుకోవడం లేదని, ఎంతసేపూ లిక్కర్ అమ్మకాలు పెంచేసి రాబడి తెచ్చుకోవడంపైనే శ్రద్ధ చూపుతున్నారని విజయ్కాంత్ విమర్శించారు.
యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ఆరోపించారు. బిజెపి దాని మిత్రపక్షాల తరఫున సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత డిఎంకె ప్రభుత్వం, ప్రస్తుత అన్నాడిఎంకె తమిళనాడు ప్రజల ప్రయోజనాలు కాపాడంలో ఘోరంగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. కాగా ఎన్నికల సభలో మాట్లాడిన విజయ్కాంత్ ధర్మపురి పిఎంకె అభ్యర్థి డాక్టర్ అంబుమణి రాందాస్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. బిజెపి నాయకత్వంలోని ఎన్డిఏలో తమిళనాడుకు చెందిన డిఎండికె, ఎండిఎంకె, పిఎంకె, ఐజెకె, కొంగుపార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి.
వార్తల్లోకెక్కాలని కేజ్రీవాల్ తంటాలు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) అధినేత అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలకు బిజెపి పదునుపెట్టింది. మోడీపై అదేపనిగా కేజ్రీవాల్ ఆరోపణలు చేయడంపై పార్టీ మండిపండింది. నిత్యం వార్తల్లోకి రావడం కోసమే మోడీపై కేజ్రీవాల్ విమర్శలు చేస్తున్నారని బిజెపి అధికార ప్రతినిధి షాన్వాజ్ హుస్సేన్ విరుచుకుపడ్డారు. మోడీపై ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లోకి ఎక్కవచ్చని ధ్యాస కేజ్రీవాల్కు ఎక్కువైందని ఆయన ధ్వజమెత్తారు.