కర్ణాటక పర్యటనకు మోడీ: రెండు రోజులు మకాం: తుమకూరు సిద్ధగంగా మఠంలో..!
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం బెంగళూరుకు రానున్నారు. రెండు రోజుల దక్షిణ కర్ణాటక పర్యటన కోసం ఆయన ఇక్కడికి రానున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. కృషి కర్మన్ అవార్డులను అందజేయడంతో పాటు కిసాన్ సమ్మాన్ యోజన కింద నాలుగో విడత నిధులను మంజూరు చేసే కార్యక్రమాన్ని కూడా ఆయన బెంగళూరులోనే ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది.
నేరుగా తుమకూరుకు..
న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నరేంద్ర మోడీ బెంగళూరు శివార్లలో వైమానిక దళానికి చెందిన విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో నేరుగా తుమకూరులోని సిద్ధగంగా మఠానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:15 నిమిషాలకు ఆయన సిద్ధగంగా మఠాధిపతి, గత ఏడాది శివైక్యం చెందిన శివకుమార స్వామి సమాధిని దర్శిస్తారు. ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తారు. తుమకూరులోని ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
డ్రోన్లపై నిషేధం..
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలను చేపట్టిన తరువాత ఈ అయిదున్నరేళ్ల కాలంలో తుమకూరు సిద్ధగంగా పీఠాన్ని దర్శించడం ఇదే తొలిసారి కావడంతో.. కర్ణాటక ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. నరేంద్ర మోడీ పర్యటించే ప్రదేశాలపై డ్రోన్లను ఎగురవేయడాన్ని నిషేధించింది. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ఆందోళనకారులు నరేంద్ర మోడీ కార్యక్రమాలను అడ్డుకునే అవకాశం ఉన్నందున.. భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.
జీకేవీకేలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్..
శుక్రవారం నాడు యలహంక సమీపంలోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్ర (జీకేవీకే)లో ఏర్పాటు చేసిన 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో నరేంద్ర మోడీ.. ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి 24 దేశాలకు చెందిన వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలు, విద్యార్థులు వందలాది మంది పాల్గొనబోతున్నారు. వారందరితోనూ నరేంద్ర మోడీ ముఖాముఖిగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా దేశాల్లో వ్యవసాయాభివృద్ధికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకుంటారని చెబుతున్నారు.