'మోడీకి స్త్రీ దోషం.. ఫిబ్రవరిలో పెనుగండం.. తప్పించుకోవాలంటే!'
తల్లిని, భార్యను దూరం పెట్టడం వల్ల మోడీకి స్త్రీ గండం చుట్టుకుందని జ్యోతిష్యుడు చెప్పడం గమనార్హం.
బెంగుళూరు: దేశంలోని జ్యోతిష్యులు రాజకీయ నాయకుల మీద, సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీల మీద సంచలన కామెంట్స్ చేయడం ఈమధ్య కాలంలో పరిపాటిగా మారిపోయింది. తాజాగా ప్రధాని మోడీకి 2017 మాఘమాసంలో గండం పొంచి ఉందని కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్యుడు బ్రహ్మాండ నరేంద్ర శర్మ గురూజీ బాంబు పేల్చారు.
ప్రధాని మోడీ ఇప్పటికే రెండు పెను గండాల నుంచి సురక్షితంగా తప్పించుకోగలిగారని నరేంద్ర శర్మ పేర్కొనడం గమనార్హం. మోడీ తప్పించుకున్న పెను గండాల్లో.. ఆఫ్గనిస్తాన్ పర్యటనలో ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణించిన విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన సందర్బం ఒకటని చెప్పారు.
ఇక పాక్ అకస్మిక పర్యటనకు వెళ్లి రావడం మోడీకి రెండో గండం లాంటిదని జ్యోతిష్యుడు తెలిపారు. మోడీ ప్రమేయం లేకుండానే ఆ పర్యటన జరిగిందని, అది ఆయనకు అపకీర్తి తెచ్చిందని జ్యోతిష్యుడు పేర్కొన్నారు.
రాబోయే ఫిబ్రవరిలో మాత్రం మోడీకి మరో పెనుగండం పొంచి ఉందని ఆయన చెబుతున్నారు. అయితే ఆ గండం ఏ రూపంలో వస్తుందో చెప్పలేమని ఆయన అంటున్నారు. ఆ గండం నుంచి గనుక మోడీ సురక్షితంగా బయటపడితే 12 ఏళ్ల పాటు ఆయనకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు.
కాగా, తల్లిని, భార్యను దూరం పెట్టడం వల్ల మోడీకి స్త్రీ గండం చుట్టుకుందని జ్యోతిష్యుడు చెప్పడం గమనార్హం. తల్లిని తనతో పాటే ఇంట్లో ఉండనిస్తే ఈ దోషం నుంచి మోడీ గట్టెక్కవచ్చని ఆయన సూచిస్తున్నాడు. పార్లమెంట్ వాస్తు స్థితి కూడా మోడీకి ప్రతికూలంగా మారుతోందని ఆయన చెప్పారు.