రైతులకు ఒక్క ఫోన్ కాల్ దూరంలో కేంద్రమంత్రి... అఖిలపక్ష సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు...
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీకు కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నారని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గతంలో స్వయంగా రైతులతో చెప్పారని గుర్తుచేశారు. వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదన ఇప్పటికీ ఉందని మరోసారి గుర్తుచేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎజెండా ఖరారు చేసేందుకు శనివారం(జనవరి 30) నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మోదీ మాట్లాడారు.
'వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా పక్కనపెట్టాలన్న ప్రతిపాదన ఇప్పటికీ ఉంది. ఈ విషయాన్ని వారికి తెలియజేయండి. సమస్యకు పరిష్కారం చర్చల ద్వారానే లభిస్తుంది. మనమంతా దేశం కోసం ఆలోచించాలి. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులతో చేసిన వ్యాఖ్యలను మళ్లీ గుర్తుచేస్తున్నాను. రైతులతో చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు... కానీ ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చించేందుకు వారికి నేను కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నానని తోమర్ వ్యాఖ్యానించారు.' అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
సాధారణంగా పార్లమెంట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఎజెండాపై చర్చించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కానీ ఈసారి సమావేశాలు ప్రారంభమయ్యాక అఖిలపక్ష భేటీ జరగడం గమనార్హం. గత రెండు నెలలకు పైగా రైతుల ఆందోళనల నేపథ్యంలో విపక్షాలు ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ తాజా అఖిలపక్ష సమావేశంలో రైతుల అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరుపున సమస్య పరిష్కారానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నామని... ఇక రైతులే ఒక మెట్టు దిగి రావాలన్నట్లుగా మోదీ తాజా వ్యాఖ్యలు ఉన్నాయి.
కాగా,ఈ నెల 22న రైతులతో కేంద్రం జరిపిన 11వ విడత చర్చలు కూడా విఫలమైన సంగతి తెలిసిందే. గతంలో ఆ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. గతంలో చర్చలు విఫలమైనప్పుడు మరోసారి చర్చలకు అవకాశం కల్పించిన కేంద్రం ఈసారి మాత్రం తదుపరి చర్చలకు గట్టి ఫరతు విధించింది. ఏడాదిన్నర పాటు వ్యవసాయ చట్టాలను పక్కనపెడుతామన్న కేంద్రం ప్రతిపాదనకు రైతులు అంగీకరిస్తేనే మరోసారి చర్చలు జరుపుతామని తేల్చి చెప్పింది. అటు రైతులు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతున్న సంగతి తెలిసిందే.