అఖిలేష్కు షాక్: బీజేపీలోకి నరేష్, గతంలోను వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాది పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు దగ్గరి వాడైన నరేష్ అగర్వాల్ ఆ పార్టీకి ఊహించని దెబ్బ కొట్టారు. ఆయన సోమవారం బీజేపీలో చేరారు.
చదవండి: సంచలనం: యోగి-మోడీలను ఒంటరిగా ఎదుర్కోలేక ఒక్కటవుతున్న మాయా-అఖిలేష్
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రంపై విశ్వాసం ఉన్నట్లు నరేష్ అగర్వాల్ ప్రకటించారు.
ప్రధాని మోడీ విధానాలు తనను ఆకర్షించాయని, అలాగే, ఉత్తర ప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పాలన తీరు బాగుందని కితాబిచ్చారు. అందుకే తాను బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు.
నరేష్ అగర్వాల్ బీజేపీలో చేరడానికి మరో కారణం కూడా ఉంది. తనను కాదని మరోసారి జయాబచ్చన్కే రాజ్యసభ సీటు ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే పార్టీ వీడారు. ఈ సమయంలో జయాబచ్చన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఇలా మాట్లాడటం ఆయనకు తొలిసారి కాదు. గతంలో ట్రిపుల్ తలాక్, శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్, తెహెల్కా కేసు, కులభూషణ్ జాదవ్ తదితర అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన సమయంలో అక్కడ కూర్చున్న ముస్లీం మహిళలు బీజేపీ మద్దతుదారులు అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ జైల్లో ఉన్న కులభూషణ్ జాదవ్ను టెర్రరిస్టుగా అభివర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
చదవండి: అనుచిత వ్యాఖ్యలు: నిన్న జయప్రదపై ఆజంఖాన్, నేడు జయబచ్చన్పై నరేష్ అగర్వాల్
2013లో ముంబైలోని శక్తి మిల్స్లో జరిగిన గ్యాంగ్ రేప్ పైన మాట్లాడుతూ.. మహిళల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2013లో నాడు బీజేపీపై, మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.