కావేరీ రచ్చ: నారిమన్ ఔట్ ? కపిల్ సిబాల్ ఇన్
న్యూఢిల్లీ/బెంగళూరు: కావేరీ జలాల పంపిణి విషయంలో కర్ణాటక ప్రభుత్వం తరపున ఇంతకాలం సుప్రీం కోర్టులో వాదించిన సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్. నారిమన్ ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు.
కర్ణాటక ప్రభుత్వానికి మద్దతుగా వాదించడానికి నారిమన్ వెనకడుగు వేస్తున్న సందర్బంలో మరో సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుడు కపిల్ సిబాల్ ను నియమించడానికి కర్ణాటక ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్నదని సోమవారం వెలుగు చూసింది.
గతవారం సుప్రీం కోర్టులో కావేరీ జలాల కేసు వాదించే సమయంలో నారిమన్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇచ్చిన పత్రాలు ముందు పెట్టుకుని వాదించారు. ఆ సందర్బంలో తాను కర్ణాటక ప్రభుత్వం తరపున వాదించడానికి సిద్దంగా లేనని చెప్పారు.
సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆరోపిస్తూ ఆయన కేసు వాదించడానికి వెనకడుగు వేశారని సమాచారం. అయితే కర్ణాటక ప్రభుత్వం కావేరీ జలాల పంపిణి వివాధం కేసులో నారిమన్ వాదనలు వినిపిస్తారని స్పష్టం చేసింది.
ఇదే సందర్బంలో నారిమన్ కేసు వాదించడానికి సిద్దంగా లేకపోవడంతో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ తో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చర్చించారు. కావేరీ జలాల విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కపిల్ సిబాల్ కు వివరించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.