వీడియో వైరల్ : రెచ్చిపోతున్న ప్రజాప్రతినిధులు.. మహిళను కాలుతో తన్నిన ఎమ్మెల్యే
గుజరాత్లోని ఓ ఎమ్మెల్యేకు కళ్లు నెత్తికి ఎక్కాయి. అధికారం ఉందికదా అని ఏమి చేసిన చెల్లుతుందిలే అనుకున్నట్లున్నాడు. ఓ మహిళను కాలుతో కొట్టాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
గుజరాత్లోని అహ్మదాబాద్ నరోడా నియోజకవర్గం ఎమ్మెల్యే బలరాం తవానీ ఒంటికి అధికార మదం బాగా పట్టినట్టుంది. ఒక మహిళ అని కూడా చూడకుండా కాలుతో కొట్టాడు. మహిళ తన ఇబ్బందిని చెప్పుకునేందుకు ఎమ్మెల్యే తవానీ కార్యాలయానికి చేరుకుంది. తమ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది అని చెప్పుకునేందుకు కార్యాలయంకు రాగా.. ఆ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
మహిళను కాలితో తన్నిన బీజేపీ ఎమ్మెల్యే
— Oneindia Telugu (@oneindiatelugu) June 3, 2019
#BJP #BalramThawani pic.twitter.com/CfggXH3L1D
కొంతమంది వ్యక్తులు మహిళపై దాడి చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. దీంతో ఆమె కిందకు పడిపోయింది. ఇక ఆ తర్వాత తవానీ వచ్చి మహిళను కాలుతో తన్నుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. వీడియో కాస్త వైరల్ అవడంతో వెంటనే నష్టనివారణ చర్యలకు దిగాడు ఎమ్మెల్యే తవానీ. ఆ ఘటనపై తాను చింతిస్తున్నట్లు చెప్పాడు. మహిళ ఎక్కడున్నా సరే ఆమెను కలిసి క్షమించాల్సిందిగా కోరనున్నట్లు చెప్పాడు. తవానీ ఎమ్మెల్యే కాకముందు నరోడా కార్పొరేటర్గా ఉన్నారు. 2017లో నరోడా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బలరాం తవానీ స్పష్టమైన మెజార్టీతో గెలుపొందారు.
ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధుల ఆగడాలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. తమ సమస్యలు తీర్చాల్సిందిగా చెప్పేందుకు వస్తున్న సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్నారు. తమ మనుషులతో దాడులు చేయిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి దాడులు చేయడం ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకుముందు చూశాం. వనజాక్షిపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాహాటంగానే దాడి చేసిన ఘటనలు చూశాం. ఇక మరో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పలుమార్లు బహిరంగంగా దుర్భాషలాడిన ఘటనలు కూడా వెలుగు చూశాయి.