కళ్ల ముందే కొట్టుకుని వెళ్లబోయిన 20 మంది విద్యార్థులు: నదిలో చిక్కుకున్న ట్రక్కు..
అహ్మదాబాద్: రాజస్థాన్ లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. రాజస్థాన్ ఒక్కటే కాదు.. ఉత్తర్ ప్రదేశ్, బిహార్ లల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల్లో వరదల బారిన పడి ఇప్పటికే 80 మరణించారు. కొందరు వరదల బారిన పడి కొట్టుకునిపోగా.. బిహార్ లో గోడ కూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ రెండు రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరదలు ఈ స్థాయిలో ప్రమాదకరంగా పరిణమించగా.. రాజస్థాన్ లో 20 మంది విద్యార్థులు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
రాజస్థాన్ లోని దుంగాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న ఓ కల్వర్టు మీద వెళ్తోన్న ఓ ట్రక్కు వరద బారిన పడింది. ప్రవాహ తీవ్రతకు అంత భారీ ట్రక్కు కొట్టుకునిపోయింది. ఆ ట్రక్కులో ఏకంగా 20 మంది విద్యార్థులు ఉండటం ఆందోళనకు గురి చేసింది. చూస్తుండగానే ఈ ట్రక్కు వరదల్లో కొట్టుకునిపోయింది. రోడ్డు పక్కకు జారి పోయింది. అదృష్టవశావత్తూ ఆ భారీ వాహనం ఓ చెట్టుకు చిక్కుకుని, నిలిచిపోయింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో విద్యార్థులు భీతిల్లిపోయారు. ప్రాణభయంతో కేకలు వేశారు.
#WATCH: Narrow escape for 12 school children after the truck they were travelling in veered off the flooded road in Dungarpur, Rajasthan. (28/09) pic.twitter.com/OtelfUn3Z6
— ANI (@ANI) September 29, 2019
దీన్ని గమనించిన స్థానికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే రంగంలోకి దిగారు. వరద ప్రవాహానికి ఎదురు వెళ్లారు. మానవహారంగా ఏర్పడ్డారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ట్రక్కు వద్దకు చేరుకున్నారు. ప్రాణభయంతో వణికిపోతున్న విద్యార్థులను రక్షించారు. ఒక్కరొక్కరుగా విద్యార్థులను తమ భుజాలపైకి ఎక్కించుకుని ప్రవాహాన్ని దాటించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనాస్థలనికి చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.