విక్రమ్ ల్యాండర్ అన్వేషణలో నాసా తుది ప్రయత్నం: ఆర్బిటన్ ద్వారా ఫొటోలు!
న్యూయార్క్: చంద్రుడి ఉపరితలం మీద దిగబోతూ హార్డ్ ల్యాండింగ్ కు గురైనట్లు భావిస్తోన్న విక్రమ్ ల్యాండర్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు చేస్తోన్న ప్రయత్నాలు కొలిక్కి రావట్లేదు. వివిధ రూపాయల్లో ఇస్రో శాస్త్రవేత్తలు చందమామపైకి పంపిస్తోన్న సంకేతాలను విక్రమ్ ల్యాండర్ గ్రహించట్లేదు. ల్యాండర్ జాడను కనుగొని అయిదురోజులు కావస్తున్నప్పటికీ.. దానితో అనుసంధానం కావడంలో విఫలమౌతున్నారు. అయినప్పటికీ శాస్త్రవేత్తలు వెనుకంజ వేయట్లేదు. తమ ప్రయత్నాలను విరమించుకోలేదు. వేర్వేరు రూపాయల్లో, విభిన్న తరంగాల ద్వారా రేడియో సంకేతాలను పంపిస్తూనే ఉన్నారు. మరోవంక- విక్రమ్ ల్యాండర్ జాడను కనుగొనడానికి అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ నాసా కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
అవును..జిహాదీలకు మా దేశంలోనే శిక్షణ: ఇప్పుడు మమ్మల్నే కాటేస్తున్నాయి: పాక్ ప్రధాని అంగీకారం!
నాసా సైతం పలు శక్తిమంతమైన సంకేతాలను పంపించింది. అవి చంద్రుడిని చేరి, మళ్లీ నాసా డీప్ స్పేస్ స్టేషన్ సెంటర్ కు వెనక్కి అందుతున్నాయే గానీ.. విక్రమ్ ల్యాండర్ ఆచూకీని పసిగట్టట్లేదు. ఈ పరిస్థితుల్లో నాసా మరో ప్రయత్నానికి దిగింది. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని ఫొటోలు తీయాలని నిర్ణయించుకుంది. ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు కూడా తెలుస్తోంది. జాబిల్లి దక్షిణ ధృవం వైపు విక్రమ్ ల్యాండర్ దిగినట్లుగా భావిస్తోన్న ప్రదేశం మొత్తాన్నీ క్షుణ్నంగా గాలించడానికి సన్నాహాలు చేస్తోంది. అణువణువూ ఫొటోలు తీయబోతోంది. దీనికోసం ఇప్పటికే చంద్రుడి కక్ష్యలోకి తాము ప్రవేశ పెట్టిన ఆర్బిటర్ ను వినియోగించుకోనుంది. ఆర్బిటర్ దిశను మార్చి వేసి, దాన్నిదక్షిణధృవం వైపు ప్రయాణించేలా చేసినట్లు సమాచారం.
దీనిపై అమెరికాకు చెందిన ప్రముఖ దినపత్రిక ది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఒకరిద్దరు నాసా శాస్త్రవేత్తలను ఉటంకించింది. ప్రస్తుతం తమ ఆర్బిటర్ దక్షిణధృవం వైపు ప్రయాణం ఆరంభించిందని నాసా అధికారిక ప్రతినిధి వెల్లడించినట్లు ఈ కథనంలో పేర్కొంది. క్రమంగా విక్రమ్ ల్యాండర్ దిగినట్లుగా అనుమానిస్తోన్న ప్రదేశానికి ఉపరితలం మీదుగా ఈ ఆర్బిటర్ ప్రయాణం సాగిస్తుందని, ఆ దశలో సంబంధిత ప్రాంతాలన్నింటినీ ఆర్బిటర్ లో అమర్చిన అత్యాధునికమైన థర్మల్ కెమెరాల ద్వారా ఫొటోలు తీస్తుందని అన్నారు. ఆ ఫొటోలను తాము ఇస్రో శాస్త్రవేత్తలకు పంపిస్తామని నాసా అధికారిక ప్రతినిధి స్పష్టం చేశారు. విక్రమ్ ల్యాండర్ ను పసిగట్టడానికి తమవంతు ప్రయత్నాలు, సహాయ సహకారాలను ఇస్రోకు అందజేస్తామని అన్నారు.