తొలి సర్జన్ శుశ్రుతుడు..సంస్కృతంలో మాట్లాడే కంప్యూటర్లు: కేంద్రమంత్రి
ముంబై: భవిష్యత్తులో మానవుల భాషను అర్థం చేసుకుని, సంభాషించగలిగే కంప్యూటర్లు తయారవుతాయని, వాటికి మూలాధారం సంస్కృత భాషేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా నిర్ధారించిందని ఆయన అన్నారు. సంస్కృతంలో మాట్లాడే కంప్యూటర్లు సమీప భవిష్యత్తులో రాబోతున్నాయని చెప్పారు. బోంబే ఐఐటీ 57వ స్నాతకోత్సవ సభకు రమేష్ పోఖ్రియాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
సంస్కృతం ఆధారంగా చేసుకుని మాట్లాడే కంప్యూటర్లు వస్తాయని నాసా ధృవీకరించిందంటే..ఆ భాషకు ఉన్న శక్తిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. సంస్కృతాన్ని సైంటిఫిక్ లాంగ్వేజ్ గా నాసా గుర్తించిందని చెప్పారు. ప్రపంచం తిలకిస్తోన్న అనేక అద్భుతాలకు మనదేశమే కేంద్ర బిందువు అని ఆయన చెప్పుకొచ్చారు. ఎలాంటి పరిజ్యానం లేని రోజుల్లోనే శుశ్రుతుడు శస్త్ర చికిత్సలను నిర్వహించాడని, దీనికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. అందుకే- ప్రపంచ దేశాలు సైతం శుశ్రుతుడిని శస్త్రచికిత్సల పితామహుడిగా గుర్తిస్తాయని అన్నారు.
మనదేశానికి చెందిన చరక రుషి.. ఆయుర్వేద వైద్యాన్ని కనుగొన్నారని పోఖ్రియాల్ చెప్పారు. ఆయుర్వేదాన్ని కనుగొన్న ఆ చరకుడే.. ఆ తరువాత అణుబాంబులను సైతం తయారు చేశారని అన్నారు. అణువుల కలయిక వల్ల శక్తిమంతమైన పేలుడును పుట్టించవచ్చని చరకుడు వేద గ్రంధాల్లో సైతం స్పష్టం చేశారని, దీన్ని ప్రయోగాత్మకంగా నిరూపించారని చెప్పుకొచ్చారు. ఎన్నో అద్భుతాలకు నిలయమైన భారత దేశం కీర్తిని ప్రపంచ దేశాల్లో విస్తరింపజేయాలని పోఖ్రియాల్.. ఐఐటీ-బీ విద్యార్థకులకు సూచించారు. వారికి హితబోధ చేశారు. ప్రస్తుతం మనం చూస్తోన్న అభివృద్ధికి వారే ప్రధాన కారకులని అన్నారు.