ఇలా కూడా చేస్తారా?: బీమా డబ్బు కోసం దారుణం, హత్య చేసి, చచ్చింది తానేనని, చివరికి...
ఓ వ్యక్తి తన జీవితంపై రూ. 4 కోట్లకు బీమా చేయించుకున్నాడు. బీమా డబ్బు పొందడానికి పెద్ద పథకం వేశాడు. చివరికి వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. అతడే హంతకుడని, బీమా డబ్బు కోసమే అలా చేశాడని తెలిసి పోలీసులే ష
నాసిక్: ఓ వ్యక్తి తన జీవితంపై రూ. 4 కోట్లకు బీమా చేయించుకున్నాడు. అయితే బీమా డబ్బు అతడు మరణించాక అతడి కుటుంబ సభ్యులకు మాత్రమే అందుతుంది. సొమ్ము నాది సోకు మరొకరిదా.. అనుకున్నాడో ఏమోగానీ పెద్ద ప్లానే వేశాడు. అందులో భాగంగా అత్యంత దారుణానికి ఒడిగట్టాడు.
తన ప్లాన్ లో భాగంగా ఓ వ్యక్తిని అతిదారుణంగా హత్య చేశాడు. ఆ చనిపోయిన వ్యక్తి తానేనని నమ్మించి బీమా డబ్బులు తీసుకోవాలనుకున్నాడు. అయితే అతడు వేసిన ఈ మాస్టర్ ప్లాన్ కాస్తా పోస్టుమార్టం నివేదికతో అతడి బెడిసికొట్టింది.
అసలేం జరిగిందంటే...
మహారాష్ట్రలోని నాసిక్లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే... నాసిక్ లోని త్రయంబకేశ్వర్ లో జూన్ 9న ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొనడంతో అతడి మొహం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. మృతదేహం వద్ద పడి ఉన్న ఏటీఎం కార్డు, కరెంట్ బిల్లుల ఆధారంగా అతడిని రామ్దాస్ వాఘ్గా గుర్తించారు. అతడు స్థానికంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్. దీంతో రామ్దాస్ చనిపోయినట్లుగా కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
కథ అడ్డం తిరిగిందిలా...
ఆ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు.. అతడు రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, అతడ్ని హత్య చేశారని నివేదికలో పేర్కొన్నారు. ముందుగా గొంతు నులిమి చంపేసి, ఆ తర్వాత అతడి ముఖాన్ని ఛిద్రం చేశారని చెప్పారు. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. రామ్దాస్ గురించి వివరాలు తెలుసుకునేందుకు అతడి కుటుంబ సభ్యులను, స్నేహితులను కలిశారు.
దిమ్మతిరిగే నిజాలు...
విచారణలో రామ్దాస్ కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పింది విని పోలీసులకు దిమ్మతిరిగింది. ఎందుకంటే హత్యకు గురయ్యాడని చెబుతున్న రామ్దాస్ బతికే ఉన్నాడని, తమ మధ్యే తిరుగుతున్నాడని అతడి సన్నిహితులు తెలిపారు. దీంతో వారు మృతదేహాన్ని మళ్లీ పరిశీలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతి చెందింది రామ్దాస్ కాదు. స్థానిక రెస్టారెంట్లో పనిచేసే ముబారక్ చాంద్ పాషా అనే వెయిటర్. రామ్దాస్ మరో ఇద్దరితో కలిసి పాషాను చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
బీమా డబ్బు కోసమే...
ఇంతకీ రామ్దాస్ ఇదంతా ఎందుకు చేశాడంటే.. అతడి పేరుమీదున్న బీమా డబ్బుల కోసం. రామ్దాస్ తన పేరు మీద వేర్వేరు కంపెనీల నుంచి రూ. 4 కోట్లకు బీమా చేయించుకున్నాడు. ఆ డబ్బు కోసమే పాషాను హత్య చేసి.. ఆ మృతదేహం తనదిగా నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోస్టుమార్టం నివేదికతో అతడి ప్లాన్ కాస్తా ఫ్లాప్ అయింది. బీమా డబ్బు కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టిన రామ్దాస్ ప్రస్తుతం పరారీలో ఉండగా, పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.