హైవేపై కారులో ఎగిసిన మంటలు: ఎన్సీపీ నేత సంజయ్ సజీవ దహనం
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్లో ఘోర కారు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం కదులుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న ఎన్సీపీ నేత సంజయ్ షిండే సజీవ దహనమయ్యారు.
ఎన్సీపీ నేత సంజయ్ షిండే తన కారులో ముంబై-ఆగ్రా హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో పింపల్గావ్ బస్వంత్ టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా కారు వైరింగ్ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయ్యింది. మంటలు వేగంగా వ్యాపించడంతో అతడు కారులోనే మృతి చెందాడు.
వైన్ ఇండస్ట్రీకి పేరుగాంచిన నాసిక్ జిల్లాలో సంజయ్ షిండే.. పండించిన ద్రాక్షలను ఎగుమతి చేస్తుంటాడు. తన ద్రాక్ష తోటకు ఎరువులు కొనుగోలు చేసేందుకు పింపల్గావ్కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కడ్వా రివర్ ఓవర్ బ్రిడ్జి సమీపంలోకి కారు వెళ్లగానే మంటలు అంటుకున్నాయి.
షార్ట్ సర్క్యూట్ తోపాటు కారులో శానిటైజర్లు కూడా ఉండటంలో మంటలు మరింత ఎగిసిపడ్డాయి. సెంట్రల్ లాకింగ్ మెకానిజమ్ కారణంగా కారు డోర్లు లాక్ కావడంతో అతడు కారులోనే చిక్కుకుపోయాడు. ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ పలించలేదు. దీంతో అతడు సజీవంగా దహనమయ్యాడు.
Recommended Video
ప్రమాద ఘటనను గమనించిన స్థానికులు సంజయ్ షిండేను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకపోయింది. ఆలస్యంగా వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి, వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.