చేత్తో ఒక్కరూపాయిచ్చినా అనర్హతే: పెద్ద నోట్లు రద్దు, ఎస్పీ గుర్తుపై ఈసీ ఇలా
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ గుర్తు ఎవరికి కేటాయించడమనేదానిపై ప్రక్రియ జరుగుతోందని త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ తెలిపారు. ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ బుధవారం సమాధానాలు చెప్పారు.
సమాజ్వాదీ పార్టీ గుర్తైన సైకిల్ కోసం అటు పార్టీ నేతలు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్లు ఘర్షణ పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎస్పీలో వివాదం ముగిసినట్లే కనిపిస్తున్నప్పటికీ మళ్లీ రాజుకునే అవకాశం లేదు. కాగా, ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ తమను పార్టీ గుర్తు విషయమని కలిశారని నసీమ్ జైదీ తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.
పెద్ద నోట్లు రద్దుపై..
ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పెద్ద నోట్లు రద్దు ప్రభావం ఉంటుందని నసీమ్ జైదీ అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం లేకుండా పోయిందని, పార్టీలు, అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలు వెదికే అవకాశం ఉందని చెప్పారు. వాటిపైనా ఈసీ దృష్టి సారిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఎప్పుడూ స్వతంత్రంగా పనిచేస్తుందని అన్నారు.
ఖర్చు విషయంలో జాగ్రత్త
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాలని, ముఖ్యంగా ఎన్నికలకు పెడుతున్న ఖర్చు విషయంలో తేడా వస్తే చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ లో పోటీ పడుతున్న అభ్యర్థులు రూ. 28 లక్షలకు మించి ఖర్చు పెట్టాడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. గోవా, మణిపూర్ రాష్ట్రాల అభ్యర్థులు రూ. 20 లక్షలు మాత్రమే వెచ్చించాలని ఆదేశించింది.
ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఎన్నికలు ఇలా..
అంతకుమించి వెచ్చిస్తే, అనర్హత సహా అన్ని రకాల చర్యలూ తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికల్లో ఎలాంటి డ్రగ్న్ పంపిణీ జరుగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో నిఘా ఉంటుందని వెల్లడించింది.
ప్రతి అభ్యర్థీ విధిగా ఎన్నికల ఖాతాను ప్రారంభించాలని, దాన్నుంచే కేటాయింపులు జరపాలని ఆదేశించింది. సదరు ఖాతాలోని వివరాలన్నీ ఈసీకి అందించాలని, ఒకవేళ బ్యాంకుల ద్వారా కాకుండా చెల్లింపులు జరపాల్సి వస్తే, చెక్కులు జారీ చేయాలని సూచించింది. రూ. 20 వేల కన్నా అధిక మొత్తంలో డొనేషన్లు వస్తే, అది చెక్కులు లేదా డీడీల రూపంలో మాత్రమే ఉండాలని పేర్కొంది. రాజకీయ పార్టీలు తమ ఖర్చులపై పూర్తి వివరాలతో కూడిన డిక్లరేషన్ ను ఎన్నికలు ముగిసిన 30 రోజుల్లోగా ప్రకటించాలని ఆదేశించింది.
పెయిడ్ వార్తలపై నిఘా ఉంచాం
ప్రతి ఎన్నికల్లో అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని, తమ పత్రికలు, ఛానళ్లలో వారికి అనుకూలంగా వార్తలు ప్రచురితం చేస్తున్న మీడియాపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటామని తెలిపింది. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల విజయవంతానికి మీడియా సహకారం తప్పనిసరి అంటూనే.. పెయిడ్ వార్తలు రాసే పత్రికలకు అందే అన్ని రకాల ప్రోత్సాహకాలనూ తొలగిస్తామని హెచ్చరించింది.
ఏ అభ్యర్థి గురించిన వార్తలు పూర్తి అనుకూలంగా, ఏకపక్షంగా వచ్చినా వాటి వివరాలను సమీకరించి, అందించేందుకు ప్రెస్ కౌన్సిల్ తరఫున కమిటీని నియమించామని, వారిచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తప్పవని పేర్కొంది. కొన్ని టీవీ ఛానళ్లు పొలిటికల్ పార్టీలు, కొంతమంది అభ్యర్థుల అధీనంలో నడుస్తున్నాయన్న విషయం తమకు తెలుసునని, ఈ టీవీ చానళ్లలో తమకు సంబంధించిన వారి గురించి వార్తలు, ప్రచారం వస్తే, మరింత కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేసింది.