ఐటికి మంచి రోజులు: పెరుగుతున్న డిమాండ్, ఇదీ నాస్కమ్ అంచనా
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. భారతీయ ఐటి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల డాలర్ల కు చేరుకుంటుందని నాస్కమ్ అంచనా వేస్తున్నది. వసతులు సమకూర్చుకునేందుకు ఆర్థిక సేవల రంగ సంస్థలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరం (2018 -19)లో 15,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.10 లక్షల కోట్లు) కు చేరుకుంటుందని నాస్కమ్ అంచనా వేస్తున్నది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం వసతులు సమకూర్చుకునేందుకు ఆర్థిక సేవల రంగ సంస్థలు నిధుల కేటాయింపు క్రమంగా పెంచుతుననాయి. మరోవైపు అమెరికా క్లయింట్ల నుంచి డిమాండ్ పెరగటం, ఈ రంగం వృద్ధి బాటలోకి సాగి మరింత ప్రగతిని సాధిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నది. 2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రంగ పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోందని, డిమాండ్పరంగా ఇప్పటికే సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయని నాస్కమ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ అన్నారు.
టెక్నాలజీలో నిధులు పెట్టేందుకు సంస్థలు సిద్ధం
ఆర్థిక సర్వీసుల రంగం.. టెక్నాలజీ విభాగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడంతో పాటు అమెరికాలో డిమాండ్ ఊపందుకోవటం వంటి అంశాలు దేశీ ఐటీ రంగానికి కీలకంగా ఉండనున్నాయని తెలిపారు. మరోవైపు భారతీయ కంపెనీలు కూడా కొత్త వ్యూహాలను రూపొందిస్తుండటం కూడా ఇందుకు దోహదకారిగా మారనున్నదన్నారు. దేశీయ ఐటీ సంస్థలు తమ వ్యూహాలను సవరించుకుంటున్నాయని వివరించారు.
డిజిటల్ టెక్నాలజీలను వృద్ధికి మార్గంగా గుర్తించిన సంస్థలు, ఇందుకనుగుణంగా ఉద్యోగులకు కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలు నేర్పించడంపై దృష్టి సారించాయని చంద్రశేఖర్ తెలిపారు. ఇవన్నీ ఒక రూపు దిద్దుకునేందుకు కొన్ని నెలల సమయం పడుతుందన్నారు. ఈ చర్యల ప్రతిఫలాలన్నీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో లభిస్తాయని పేర్కొన్నారు. ఈ ఏడాది వృద్ధి లక్ష్యాలను పరిశ్రమ అందుకోగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొత్త డిజిటల్ టెక్నాలజీలపై ఉద్యోగుల్లో నైపుణ్యాలను మెరుగుపరచటంపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయని తెలిపారు. రానున్న కొద్ది నెలల్లో ఇవన్నీ ఒక రూపానికి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
ఈ ఏడాది అంచనా మేరకు ప్రగతి
ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఐటీ ఇండస్ట్రీ, అసోసియేషన్ల అంచనా మేరకు ప్రగతి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సారి ఐటీ రంగ ఎగుమతుల్లో 7 - 8 శాతం ప్రగతి నమోదవుతుందని, దేశీయంగా వ్యాపారం 10 - 11 శాతం వ్రుద్ధి సాధిస్తుందని గత జూన్లో నాస్కమ్ అంచనాలు విడుదల చేసింది. అమెరికా, బ్రిటన్ దేశాలతోపాటు సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలు వీసా నిబంధనలు కఠినతరం చేయడం, అంతర్జాతీయ మార్కెట్ లో అనిశ్చితి వల్ల ఐటీ రంగంలో వ్యయాలు తగ్గడంతో భారత సాఫ్ట్ వేర్ పరిశ్రమపై గతేడాది ఒత్తిడి పెరిగింది.
మారని వీసాల సంఖ్య
అభివృద్ధి చెందిన దేశాలు రక్షణాత్మక విధానాలు అవలంభించడంపై ఆందోళన అవసరం లేదని, వీసాల జారీ సంఖ్యలో మార్పులు చేయకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అమెరికా 65,000 హెచ్ - 1 బీ వీసాలు జారీ చేయనున్నదని గుర్తు చేశారు. యాంత్రీకరణపై అన్ని సంస్థలు దృష్టి సారించడం ముఖ్య పరిణామమన్నారు. సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ) ద్వారా, కంపెనీలకు కొత్త టెక్నాలజీలు అందించడం వీలవుతుందన్నారు. ఇప్పటికే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) పై బెంగళూరులో సీఓఈ ని నెలకొల్పగా, విశాఖపట్నం, అహ్మదాబాద్, గురుగ్రామ్లలో కూడా నెలకొల్పనున్నట్లు వివరించారు. తయారీ, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఇంధన రంగాల్లో ఐఓటీ వినియోగంపై దృష్టి సారించినట్లు తెలిపారు.