విధ్వంసానికి డిఎంకె కుట్ర,బిజెపి ముందు మోకరిల్లండి,పన్నీర్ తప్పించేందుకేనా?
జల్లికట్టు ఉద్యమం చివరి అంకంలో జరిగిన విధ్వసంపై డిఎంకెపై అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ ఆరోపణలు గుప్పించారు.అయితే నటరాజన్ పై డిఎంకె ఎదురుదాడికి దిగింది.
చెన్నై:జల్లికట్టు ఉద్యమం చివరి అంకంలో జరిగిన విధ్వసంపై డిఎంకెపై అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ ఆరోపణలు గుప్పించారు.అయితే నటరాజన్ పై డిఎంకె ఎదురుదాడికి దిగింది.
జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ మెరీనాబీచ్ వేదికగా యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. అయితే ఈ ఆందోళనలకు రాజకీయపార్టీలు కూడ మద్దతును ప్రకటించాయి.
జల్లికట్లుపై యువత చేపట్టిన ఆందోళనతో తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై ముసాయిదాబిల్లును ఆమోదం తెలిపింది
ఈ ఆందోళన ఇతర రాష్ట్రాలకు చెందిన యువతకు ఆదర్శంగా నిలిచింది. కర్ణాటకతో పాటు, ఆంద్రప్రదేశ్ కు చెందిన యూత్ కూడ పలు ఆందోళనలకు సిద్దమయ్యారు.
రాష్ట్రపతి అనుమతి లేకే ఇబ్బంది
జల్లికట్టు ను నిర్వహించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందని అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ ఆరోపించారు.జల్లికట్టు నిషేధానికి కారణమైన పెటా సంస్థ దేశంలోకి అడుగుపెట్టడానికి ప్రధాన కారణం యూపిఏ ప్రభుత్వమని ఆయన దుయ్యబట్టారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ ప్రత్యేక చట్టంలో రాష్ట్రపతి అనుమతి లేకపోవడంతో జల్లికట్టు నిర్వహణకు అంతరాయం కల్గింది. ఈ ఏడాది జల్లికట్టు నిర్వహణకు ప్రయత్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
విధ్వంసానికి డిఎంకె కుట్ర
మెరీనాబీచ్ వేదికగా తమిళనాడు యువత ఆందోళన చేపట్టింది.అయితే ఈ ఆందోళన మూడో రోజుకు చేరుకోవడంతో డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మెరీనాబీచ్ కు వెళ్ళాడు. అయితే ఆందోళన చేస్తోన్న యువత స్టాలిన్ ను తిప్పి పంపేశారని నటరాజన్ చెప్పారు. దీంతో ఆందోళనకు డిఎంకెలో ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయన్నారు.డిఎంకె ప్రోద్బలంతోనే సంఘవిద్రోహశక్తులు ఉద్యమంలో ప్రవేశించాయని ఆయన ఆరోపించారు.కరుణానిధి, స్టాలిన్ లకు సన్నిహితంగా ఉండేవారే విధ్వంసానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
జల్లికట్టు ఉద్యమంలో విధ్వంసానికి కారణమైన డిఎంకె పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ ఆరోపణలు గుప్పించారు.ఉద్యమాన్ని స్వంతం చేసుకొనేందుకుగాను డిఎంకె రైలు రోకోలు, నిరహరదీక్షలకు పాల్పడిందన్నారు.దీంతో ఉద్యమం రూటు మారిందని ఆయన చెప్పారు. విధ్వంసానికి డిఎంకె కారణమైందన్నారు.ఈ మేరకు తన వద్ద ఆధారాలున్నాయని ఆయనచెప్పారు. ఉద్యమంలోకి కొంతమంది ముస్లిం సామాజికవర్గానికి చెందినవారిని కూడ తీసుకువచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ విధ్వంసంలో పోలీసులు కూడ చేయి వేశారని ఆయన ఆరోపించారు.
పన్నీర్ ను తొలగించేందుకే శశికళ బృందం కుట్ర
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించేందుకుగాను అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె భర్త నటరాజన్ బృందం కుట్ర పన్నిందని డిఎంకె ఆరోపించింది. ఇందులో భాగంగానే జల్లికట్టు ఉద్యమంలో విధ్వంసాలకు పోలీసులను ఉసిగొల్పారని డిఎంకె ఆరోపించింది.విధ్యార్థులపైకి పోలీసులను ఉసిగొల్పి విధ్వంసం సృష్టించేందుకు నటరాజన్ కుట్ర పన్నారని డిఎంకె ఎంఏల్ఏ టిఆర్ పి రాజా ఆరోపించారు.
ముఖ్యమంత్రి ప్రకటన నటరాజన్ వినలేదా
జల్లికట్టు ఆందోళనల సందర్భంగా చోటుచేసుకొన్న విధ్వంసాలపై అసెంబ్లీలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటన చేశారని డిఎంకె ఎంఏల్ఏ టిఆర్ పి రాజా గుర్తుచేశారు. ఈ ప్రకటనను నటరాజన్ వినలేదా అని ఆయన ప్రశ్నించారు.నటరాజన్ వ్యాఖ్యలు రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని అవమానపర్చేవిధంగా ఉన్నాయని చెప్పారు. జల్లికట్టు విధ్వంసానికి తమ పార్టీని నిందించడం సరికాదన్నారాయన.
కుటుంబం కోసమా, బిజెపి కోసమా
అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ ఎవరి కోసం ఈ ఆరోపణలు చేస్తున్నారో ఆయన తెలుసుకోవాలని డిఎంకె ఎంఏల్ఏ రాజా హితవు పలికారు. తన కుటుంబం కోసమా, బిజెపి కోసమా అనేది ప్రజలకు అర్థమౌతోందన్నారు.జయలలిత బతికున్నరోజుల్లో ఎక్కడో ఉన్న నటరాజన్ ఆమె మరణం తర్వాత పోయేస్ గార్డెన్ లో కూర్చొని ఆలోచించుకోవాలన్నారు.
పన్నీర్ ను గౌరవించాం
నటరాజన్ బృందం వివిద అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కొని ఆ భయంతో సిఎం పదవిని చేపట్టేందుకు జంకుతున్నారని డిఎంకె ధ్వజమెత్తింది. సిఎం పదవికి దూరంగా ఉండలేక, అలాగే దానిని వదులుకోలేక అల్లాడిపోతున్నారని చెప్పారు. జల్లికట్టు వ్యవహరంపై సిఎం డిల్లీ వెళ్తున్నప్పుడు విజయంతో రండి అంటూ తమ నేతను ఆశీర్వదించారని, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు, పన్నీర్ సెల్వం కాన్వాయ్ కు కూడ దారి ఇచ్చి గౌరవించినట్టు డిఎంకె గుర్తు చేశారు.
నటరాజన్ గ్రూప్ కు కోపం, అందుకే ఆరోపణలు
ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కు గౌరవించడం అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ అండ్ కంపెనీకి ఆగ్రహం తెప్పించిందని డిఎంకె విమర్శించింది.తానే సిఎం అనే ప్రభుత్వం అనే భ్రమలో నటరాజన్ మాట్లాడుతున్నారని డిఎంకె దుయ్యబట్టింది. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని డిఎంకె ఎంఏల్ఏ చెప్పారు. అక్రమాస్తుల కేసుల గురించి చూసుకోండి,అందుకు అవసరమైతే బిజెపి ముందు మోకరిల్లండి , మాకేమీ అభ్యంతరం లేదంటూ డిఎంకె ఎంఏల్ఏ రాజా నటరాజన్ కు చురకలంటించారు.