నా పని అంతా తెర వెనకే: శశికళ భర్త నటరాజన్
తాను తెర వెనక ఉండడానికే ఇష్టపడుతానని శశికళ భర్త నటరాజన్ అన్నారు. ప్రజల ముందుకు వచ్చే ఉద్దేశం తనకు లేదని స్ఫష్టం చేశారు.
చెన్నై: తాను ఎప్పడు కూడా తెరవెనుక ఉండడానికే ఇష్టపడతానని అన్నాడియంకె ప్రధాన కార్యదర్శి వీకే శశికళ భర్త నటరాజన్ అన్నారు. తమిళనాడు అధికార పార్టీలో కొనసాగుతున్నా కూడా ప్రజల ముందుకు వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
అధికార పార్టీని శశికళ కుటుంబం హస్తగతం చేసుకుంటోందని ఆరోపణలు వస్తుండడంపై కూడా ఆయన స్పందించారు. అన్నాడియంకె కార్యకలాపాల్లో తాను ఎప్పుడూ వెనుకే నిలబడి ఉంటానని, పార్టీని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 69 జయంతి సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈనెల 18న అసెంబ్లీలో జరిగిన గందరగోళానికి ప్రతిపక్ష డీఎంకే పార్టీనే కారణమని నటరాజన్ విమర్శించారు. అసమ్మతి నేత పన్నీర్ సెల్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. చనిపోయిన ఏనుగు చుట్టూ ఈగలు చేరిన మాదిరిగా పన్నీర్ సెల్వం పరిస్థితి తయారైందని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీని చీల్చడం ఎవరివల్లా కాదని, అలా ప్రయత్నించే వారిని పార్టీలో ఉండనిచ్చే ప్రసక్తే లేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ మరణానంతరం జయలలితను తమ కుటుంబమే కాపాడిందని, జయ లలిత మరణించే వరకు ఆమెకు అండగా నిలబడి చాలా త్యాగాలు చేసిందని ఇటీవల ఆయన అన్నారు.