సీబీఐ కోర్టులో లోంగిపోయిన చిన్నమ్మ శశికళ భర్త, ప్రభుత్వానికి మోసం, రెండేళ్లు జైలు!
చెన్నై: మోసం, కుట్ర, పన్ను ఎగవేశారనే కేసుల్లో రెండు సంవత్సరాలు జైలు శిక్షపడిన అన్నాడీఎంకే పార్టీ బహిష్కత నేత చిన్నమ్మ వీకే శశికళ భర్త ఎం. నటరాజన్ గురువారం చెన్నైలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో లోంగిపోయారు. తనకు జామీను మంజూరు చెయ్యాలని నటరాజన్ సీబీఐ కోర్టులో మనవి చేశారు.
విదేశాలు
విదేశాల (యూకే) నుంచి విలాసవంతమైన కారు దిగుమతి చేసుకుని నకిలి పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేసి ఆదాయపన్ను చెల్లించుకుండా ప్రభుత్వాన్ని, అధికారులను మోసం చేశారని 23 ఏళ్ల క్రితం నటరాజన్ తో సహ నలుగురి మీద సీబీఐ, ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.
2010లో జైలు శిక్ష
ప్రభుత్వాన్ని, అధికారులను మోసం చేశారని నటరాజన్ మీద నేరం రుజువు కావడంతో సీబీఐ ప్రత్యేక కోర్టు 2010లో నటరాజన్, టీటీవీ భాస్కరన్, యోగేష్ బాలక్రిష్ణన్, సుజరిత సుందరరాజన్ లకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
మద్రాసు హైకోర్టు తీర్పు
సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ నటరాజన్ తదితరులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. మద్రాసు హైకోర్టులో కొన్ని సంవత్సరాలు కేసు విచారణ జరిగింది. 2017 నవంబర్ 17వ తేది సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన రెండు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేస్తూ మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పింది.
సుప్రీం కోర్టుకు నటరాజన్
సీబీఐ ప్రత్యేక కోర్టు, మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నటరాజన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పిటిషన్ విచారణ చేసి చెన్నైలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో లోంగిపోవాలని, జామీను ఇవ్వాలా, వద్దా అనే నిర్ణయం అక్కడి న్యాయమూర్తి తీసుకుంటారని నటరాజన్ కు సూచించారు.
అరెస్టు భయంతో !
రెండేళ్లు జైలు శిక్షపడినా అనారోగ్యం సమస్య అడ్డం పెట్టుకున్న నటరాజన్ ఇంత కాలం జైలుకు వెళ్లలేదు. సుప్రీం కోర్టు లోంగిపోవాలని ఆదేశాలు జారీ చెయ్యడంతో పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అనే భయంతో తన న్యాయవాదిని వెంట పెట్టుకున్న నటరాజన్ గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో లోంగిపోయి జామీను ఇవ్వాలని మనవి చేశాడు.