దేశం తర్వాతే పార్టీ : చివరన సొంత ప్రయోజనాలని బ్లాగ్లో రాసుకొన్న అద్వానీ
న్యూఢిల్లీ : గాంధీనగర్ ప్రజలకు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ కృతజతలు తెలిపారు. 1991 నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు. నియోజకవర్గ ప్రజల ప్రేమ, మద్దతు సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 6 శనివారం బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తన బ్లాగులో పోస్ట్ చేశారు అద్వానీ.
అద్వానీ అభిప్రాయాలు
ఏప్రిల్ 6 బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనుంది. ఇది బీజేపీ శ్రేణులకు ముఖ్యమైన రోజు, ఆత్మపరిశీలనతోపాటు గత జాపకాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించాల్సిన రోజని పేర్కొన్నారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా దేశ ప్రజలతోపాటు కోట్లాది మంది బీజేపీ శ్రేణులతో అభిప్రాయాలను పంచుకోవాలని భావిస్తున్నానని తెలిపారు.
అంకితభావంతో నిస్వార్థ సేవ
14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆరెస్సెస్లో చేరానని గుర్తుచేశారు అద్వానీ. అప్పటినుంచి దేశం కోసం సేవ చేయడం అలవాటుగా మారిందని పేర్కొన్నారు. రాజకీయ జీవితంలో జన సంఘ్, బీజేపీతో ఏడు దశాబ్దాలుగా విడదీయలేని అనుబంధం ఉందని బ్లాగులో రాసుకొన్నారు అద్వానీ. ఫస్ట్ భారతీయ జనసంఘ్, తర్వాత బీజేపీ ఏర్పాటు చేశామని ... రెండింటిలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, అటల్ బిహారీ వాజ్ పేయితోపాటు పలువురు స్పూర్తిదాయక నేతలతో పనిచేసే గొప్ప అవకాశం లభించిందని గుర్తుచేసుకున్నారు.
తొలుత దేశం
తొలుత దేశం, తర్వాత పార్టీ, చివర సొంత ప్రయోజనాలు అనే స్పూర్తిదాయక సూత్రాన్ని జీవితంలో అన్ని పరిస్థితుల్లో పాటించానని అద్వానీ ఉద్ఘాటించారు. అలాగే రాజకీయంగా విభేదించేవారిని ఎప్పుడూ శత్రువులుగా చూడలేదని పేర్కొన్నారు. బీజేపీ భావ భారత జాతీయవాదం మాత్రమేనని పేర్కొన్నారు. తమతో రాజకీయంగా విభేదించే వారిని ఎన్నడూ దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించలేదని తెలిపారు. ప్రతి పౌరుడి స్వేచ్చకు పార్టీ నిబద్దతతో కట్టుబడి ఉంది. రాజకీయంగా కూడా ఇదే విధానం అవలంభించామని తెలిపారు. మీడియా సహా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు.