జాతీయ గీతం విన్నప్పుడు భావోద్వేగానికి లోనవుతా: బిగ్ బి
అడిలైడ్: జాతీయ గీతం 'జనగణమన' విన్నప్పుడల్లా భావోద్వేగానికి లోనవుతానని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన భారత్ - పాకిస్ధాన్ మ్యాచ్ ముందు ఇరు దేశాలు జాతీయ గీతాలాపన ఏర్పాటు చేయడాన్ని 72 ఏళ్ల అమితాబ్ బచ్చన్ ప్రశంసించాడు.
ఇక ఆదివారం నాడు అడిలైడ్లో జరిగిన భారత్, పాకిస్ధాన్ మ్యాచ్కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అమితాబ్ ఆకట్టుకున్నారు. స్టార్స్పోర్ట్స్-3 చానెల్లో హిందీ కామెంటరీ చెప్పిన అమితాబ్... భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ క్రికటర్ మొహిందర్ అమర్నాథ్, షోయబ్ అక్తర్లతో కలిసి క్రికెట్ వ్యాఖ్యానం వినిపించాడు.
కెరీర్, వృత్తి ముఖ్యంగా భావించే మీరు క్రికెట్ వ్యాఖ్యానానికి వచ్చారని అంటే, దేశం కోసం క్రీడాకారులు అడుతున్నప్పుడు ఆ మాత్రం బాధ్యతగా ఉండడం అవసరమని అమితాబ్ అన్నారు. మీలాంటి వారితో కూర్చునే సమయం అత్యంత అరుదుగా దొరుకుతుందని, ఇలా కూర్చునందుకు తనకు ఆనందంగా ఉందని అమితాబ్ ఇతర వ్యాఖ్యాతలను ఉద్దేశించి అన్నారు.
‘కపిల్, అక్తర్, ద్రవిడ్ లాంటి దిగ్గజాలతో కలిసి కామెంటరీ చెప్పడం గర్వంగా ఉంది. భారత్ 300 చేస్తుందని అనుకున్నాను. చేసింది' అని అమితాబ్ భారత ఇన్నింగ్స్ ముగిశాక ట్విట్టర్లో ట్వీట్ చేశారు.