రెండు చోట్ల కాంగ్రెస్ తో ఫ్రెండ్లీ ఫైట్..ఓ స్థానంపై పేచీ: మిగిలిన సీట్లల్లో సర్దుబాటు
శ్రీనగర్: లోక్ సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తులపై పడ్డాయి. భావ సారూప్యం గల పార్టీలతో కలిసి ఎన్నికల యుద్ధానికి దిగుతున్నాయి. బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ.. ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ రెండు పార్టీలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని పూర్తి చేసుకున్నాయి. తాజాగా- జమ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ సీట్లను సర్దుబాటు చేసుకుంది.
జమ్మూకాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఎప్పటి నుంచో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాకపోతే- ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయం ఇన్నాళ్లూ కాస్త అస్పష్టత కొనసాగింది. బుధవారం నాడు సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య స్పష్టత ఏర్పడింది. జమ్మూకాశ్మీర్ లో మొత్తం ఆరు లోక్ సభ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ రెండు చోట్ల, నేషనల్ కాన్ఫరెన్స్ ఒక స్థానంలో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. మరో రెండు చోట్ల స్నేహ పూరక పోటీ ఉంటుందని ఆ రెండు పార్టీల సీనియర్ నాయకులు ఫరూఖ్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. మరో స్థానాన్ని ఎవరు తీసుకోవాలనే విషయంపై ఏదీ తేలలేదు.
కాంగ్రెస్ తో కటీఫ్ ఒంటరి పోరుకు దిగనున్న నేషనల్ కాన్ఫరెన్స్
కాంగ్రెస్ పార్టీ జమ్మూ, ఉధంపూర్ లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. నేషనల్ కాన్ఫరెన్స్ శ్రీనగర్ లో అభ్యర్థిని దింపుతుంది. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా శ్రీనగర్ నుంచి పోటీ చేస్తారు. అనంతనాగ్, బారాముల్లా నియోజకవర్గాల్లో ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుంది. పొత్తు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ లు వేర్వేరుగా అభ్యర్థులను దింపుతారు. ఎవరు గెలిస్తే.. వారు పొత్తు పార్టీకి సహకరించాల్సి ఉంటుంది. కాగా, కీలకమైన లఢక్ స్థానాన్ని ఎవరు తీసుకోవాలనే విషయంపై చర్చలు కొలిక్కి రాలేదు. త్వరలోనే దీన్ని పరిష్కరించుకుంటామని ఫరూఖ్ అబ్దుల్లా, గులాంనబీ ఆజాద్ తెలిపారు.