మెహబూబా జెండా ఆవిష్కరణలో అపశృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో స్వాతంత్ర్య వేడుకల్లో అపశ్రుతి టదొర్లింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తుండగా జెండా నేలపై పడిపోయింది. వెంటనే పతాకాన్ని సీఎం, భద్రతా సిబ్బంది పైకి తీశారు.
శ్రీనగర్లోని బక్షీ స్టేడియంలో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ముఖ్యమంత్రిగా మెహబూబాకి ఇదే తొలి పతాకావిష్కరణ కావడం గమనార్హం.
మెహబూబా జెండా ఎగురవేసేందుకు తాడును లాగగానే.. జాతీయపతాకం కిందపడిపోయింది. దీంతో ఆమె సెల్యూట్ చేసేవరకు ఇద్దరు భద్రతాసిబ్బంది జెండాను చేతులతో పట్టుకుని నిలబడ్డారు. మెహబూబా వేదిక నుంచి వెళ్లిపోయిన తర్వాత భద్రతా సిబ్బంది జెండాను సరిచేసి ఎగురవేశారు.
అంతకుముందు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. తుపాకులతో ఏ సమస్యకూ పరిష్కారం లభించదని అన్నారు. గత కేంద్ర పాలకులు చేసిన పొరపాట్లను ప్రధాని నరేంద్ర మోడీ చేయరని అనుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర సమస్యలకు సరైన పరిష్కారం చూపగలరన్న నమ్మకం నరేంద్ర మోడీపై తమకు ఉందని చెప్పారు. రాష్ట్రంలోని యువత ఇక్కడ శాంతి నెలకొనేందుకు కృషి చేయాలని, కాశ్మీర్ అంటే భూలోక స్వర్గమని నిరూపించాలని పిలుపునిచ్చారు.