రెండేసి కార్లు కొంటే ఏంచేస్తారు?: ఢిల్లీకి ఎన్జిటి ప్రశ్న
న్యూఢిల్లీ: దేశరాజధానిలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన సరి-బేసి సంఖ్యల వాహనాల వాడకం విధానంపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్పందించింది. ప్రజలు రెండేసి కార్లు కొంటే అప్పుడేం చేస్తారు? అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కాలుష్యం నివారించడానికి ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ విధానం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చని వ్యాఖ్యానించింది. జనవరి 1 నుంచి సరిసంఖ్య రిజిస్ట్రేషన్ నెంబరు గల కార్లు సరి సంఖ్య తేదీలో, బేసి సంఖ్య రిజిస్ట్రేషన్ నెంబరు గల కార్లు బేసి సంఖ్య తేదీల్లో ఢిల్లీ రోడ్లపైకి అనుమతిస్తామని అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే.
కాగా, ఆదివారాల్లో రెండు రకాల వాహనాలకూ అనుమతి ఉంటుంది. అంతేగాక, వినియోగదారుల కోసం ప్రజారవాణా వాహనాల సంఖ్య పెంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
కాలుష్యం కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా డీజిల్ వాహనాలను అనుమతించొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) సూచించింది. డీజిల్ వాహనాలకు రిజిస్టేషన్లు చేయొద్దని ప్రతిపాదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగుల కోసం డీజిల్ వాహనాలు కొనొద్దని ఆదేశించింది.