జిఎస్టీ: సొంత కేసులతో సోనియా మెలిక పెడ్తున్నారా?
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు ద్వారా తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలను మురికిబట్టించాలని భారతీయ జనతా పార్టీ యోచిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆదివారం నాడు ఆరోపించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో.. నెహ్రూ - గాంధీ కుటుంబం ఒక్క రూపాయి లాభం కూడా తీసుకోలేదని చెప్పారు. బిజెపి నేతలు తమ పార్టీ నేతలకు మురికి అంటించే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు, జిఎస్టీకి, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధం లేదని రాహుల్ గాంధీ చెప్పారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ (వస్తుసేవల పన్ను) బిల్లును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ బిల్లు ఆమోదం దిశగా పార్లమెంటులో ఈ వారం కీలకమైన అడుగులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్యసభలో బిల్లుకు ఆమోదం తెలపాలంటే బిల్లుపై తమ కనీస డిమాండ్లను నెరవేర్చాలని కాంగ్రెస్ షరతు విధిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ కేంద్రం ముందు ప్రధానంగా మూడు డిమాండ్లు పెడుతోంది. మూడింటిలో రెండింటికైనా ఆమోదం తెలిపి ఆ పార్టీని కేంద్రం సంతృప్తిపరిచే అవకాశాలున్నాయి. తయారీరంగ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై విధించదలిచిన అదనపు పన్నును తొలగించడానికి కేంద్రం సంసిద్ధత ప్రకటించింది.
కేంద్రం జిఎస్టీ బిల్లును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ డిమాండ్లు కొన్ని నెరవేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో ప్రచారం కూడా జరుగుతోంది. జిఎస్టీ బిల్లుకు, నేషనల్ హెరాల్డ్ కేసుకు కాంగ్రెస్ పార్టీ అనధికారికంగా లింక్ పెడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
తన కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణల్లో ప్రభుత్వ సంస్థలు దూకుడుగా ముందుకు వెళ్లకూడదని సోనియా గాంధీ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసు, అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన భూముల లావాదేవీల్లో ప్రభుత్వం మెతగ్గా వ్యవహరించాలని ఆమె కోరుకుంటున్నారట.
అదే సమయంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ముఖ్యమంత్రులు వీరభద్ర సింగ్, అమరీందర్ సింగ్లపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మాత్రం సోనియా పెద్ద పట్టింపుతో లేరట! జిఎస్టీ బిల్లుపై... సోనియా కుటుంబంపై రాజకీయ ప్రతీకారానికి కాంగ్రెస్ లంకె పెడుతోందా అనే చర్చ సాగుతోంది.